హుజూరాబాద్/జమ్మికుంట, సెప్టెంబర్ 27: మత విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలను నమ్మొద్దని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మతపిచ్చిగాళ్ల పాలనలో దేశం నాశనమైందని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వం ఎం తో అవసరమని సూచించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, జమ్మికుంటలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయతో కలిసి కొత్త పింఛన్ మంజూరు పత్రాలు, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
జమ్మికుంటలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్సీ క్షీరాభిషేకం చేశారు. హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల.. నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయి అయినా తెచ్చారా? అని కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. హుజూరాబాద్లో అందరికీ అందుబాటులో ఉంటానని, ప్రతి సమస్యనూ పరిష్కరిస్తానని హామీఇచ్చారు.