హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ ఇచ్చిన క్లారిఫికేషన్ నోటీసులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. ఎఫ్ఐఆర్ కాపీని, ఫిర్యా దు ప్రతులను తనకు అందించాలని ఆమె సీబీఐని కోరారు. ఈ మేరకు సీబీఐ డీఎస్పీ అలోక్కుమార్ సాహీకి కవిత శనివారం లేఖ రాశారు. డాక్యుమెంట్లు అందిన తర్వాతే విచారణ తేదీని ఖరారు చేయవచ్చని లేఖలో పేర్కొన్నారు.
ఈ కేసుకు సంబంధించి, క్లారిఫికేషన్ తీసుకునేందుకు సీబీఐ శుక్రవారం సీఆర్పీసీ సెక్షన్ 160 కింద క్లారిఫికేషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 6న హైదరాబాద్లోని ఎమ్మెల్సీ నివాసానికి వచ్చి వివరణ తీసుకుంటామని సీబీఐ డీఎస్పీ అలోక్కుమార్ సాహీ ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఎమ్మెల్సీ కవిత సీబీఐ అధికారి అలోక్ కుమార్ సాహీకి లేఖ రాశారు. ఈ ఏడాది జూలై 22న కేంద్ర హోంశాఖకు ప్రవీణ్రాయ్ చేసిన ఫిర్యాదు కాపీ, సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని లేఖలో ఆమె కోరారు. వీలైనంత త్వరగా ఆ పత్రాలను తనకు అందించాలని, డాక్యుమెంట్లు అందిన తర్వాతే క్లారిఫికేషన్ నోటీసులకు సంబంధించి కలిసే తేదీని నిర్ణయిద్దామని ఆ లేఖలో కవిత స్పష్టంచేశారు.