హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవుల్లో నామినేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను తిరసరిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తమది బీసీ వ్యతిరేక పార్టీ అని బీజేపీ మరోసారి నిరూపించుకున్నదని విమర్శించారు. మంగళవారం శాసనమండలి ప్రాంగణంలో జరిగిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో పాల్గొని, నివాళి అర్పించారు.
ఐలమ్మ పోరాటం భవిష్యత్తుతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. క్యాబినెట్ పంపించిన ఎమ్మెల్సీల పేర్లను తిరస్కరించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టంచేశారు. దేశంలో బీజేపీ రాజ్యాంగం నడుస్తున్నదా? అనే అనుమానం కలుగుతు న్నదని పేర్కొన్నారు. అన్నింటినీ గమనిస్తూ ప్రజలను ఏకతాటిపై నడిపించాలన్న విషయాన్ని పకన పెట్టి గవర్నర్లు కక్ష పూరితంగా వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు.
గవర్నర్ను బీజేపీ ప్రభుత్వం నియమించిందని, బీజేపీ మరోసారి బీసీ వ్యతిరేక పార్టీ అని నిరూపించుకుందని స్పష్టంచేశారు. బీసీ వర్గాలను పైకి తీసుకురావడానికి బీఆర్ఎస్ చర్యలు తీసుకుంటుంటే, బీజేపీ పార్టీ అందుకు విరుద్ధంగా పనిచేస్తుందని మండిపడ్డారు. కార్య్రకమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్గుప్తా, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు. బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్, బీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.