నల్లగొండ, జనవరి 4: దేశంలో, రాష్ట్రంలో అరాచకాలకు బీజేపీ మారుపేరుగా మారిందని, అందుకు బండి సంజయ్ వ్యవహార శైలే నిదర్శనమని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఆ పార్టీ వారే ఉల్లంఘిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. మంగళవారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీలో బండి సంజయ్, జేపీ నడ్డా, కిషన్రెడ్డి, అర్వింద్ తీరు అరాచకంగా ఉన్నదని దుయ్యబట్టారు. బీజేపీని చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారంటూ ఆ పార్టీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదమని పేర్కొన్నారు. బీజేపీ విద్వేషపూరిత పాలనతో దేశ ప్రజలు భయపడే రోజులొచ్చాయని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తాయన్న భయంతో ఐటీ దాడులు, ఈడీ, సీబీఐ సంస్థలతో సోదాలు చేయిస్తూ అణచివేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఇదే తరహా తెలంగాణలోనూ అనుసరించాలని కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఒకవైపు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలంటూ.. మరోవైపు 317జీవోను వ్యతిరేకిస్తూ బీజేపీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నదని విమర్శించారు.