హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): తాము సీఎం కేసీఆర్లో అంబేద్కర్ను చూసుకుంటున్నామని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న చెప్పారు. తెలంగాణ ప్రజల ఎజెండానే పాలన ఎజెండాగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని పేర్కొన్నారు. కరువునేలపై గలగలపారే జలాలను సృష్టించి పొట్టచేతపట్టుకొని వెళ్లిన వారిని తిరిగి తమ గూళ్లకు చేర్చటమే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి లక్షలాది కార్మికులు రాష్ర్టానికి వలస వచ్చేలా చేసిన మానవీయ పాలకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు.
నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్కింగ్, జాన్ ఎఫ్ కెన్నడీ లాంటి ప్రపంచమేధావులతోపాటు ఎస్ఆర్ శంకరన్లాంటి మేధావులు కలలుగన్న సమాజాన్ని నిష్టతో సీఎం కేసీఆర్ సృష్టిస్తున్నారని తెలిపారు. భారతీయ తత్వజ్ఞానాన్ని ఆకళింపు చేసుకొని సామాజిక, ఆర్థికస్థితిని మార్చేందుకు రాజకీయ అస్ర్తాన్ని సంధించిన గొప్ప పాలకుడు సీఎం కేసీఆర్ అని అభివర్ణించారు. ఇదంతా తెలంగాణ పౌరుడిగా తన మసులోంచి వచ్చిన కృతజ్ఞతాపూర్వక అభిప్రాయమని స్పష్టం చేశారు