రామడుగు (చొప్పదండి) ఏప్రిల్ 8 : ఆరు గ్యారెంటీల అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ప్రజలను మాయచేసి మభ్యపెట్టిందని, గ్యారెంటీలను అమలు చేయకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజ్పల్లి శివారులోని వసుధ గార్డెన్లో చొప్పదండి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ విద్యార్థి యువజన చైతన్య సదస్సు నిర్వహించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, గెల్లు శ్రీనివాస్ పాల్గొన్న ఈ సదస్సులో దేశపతి మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా నదులపై కాళేశ్వరం, పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చినట్టు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు తెచ్చామని, పదేండ్లలో 1.61 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 30 వేల ఉద్యోగాలకు గత ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిందని చెప్పారు. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతు వినిపించాలంటే వినోద్ కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
సమస్యలపై ప్రశ్నించే గొంతునవుతా
ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన అబద్ధపు ప్రచారాలతో అప్పుడు మోసపోయామని, మళ్లీ మోసపోవద్దని ఎంపీ అభ్యర్థి వినోద్ అన్నారు. మరోసారి తనను ఎంపీగా గెలిపిస్తే ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతునవుతానని పేర్కొన్నారు. యాసంగి సీజన్లో ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.