రాజన్న సిరిసిల్ల : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కూడా పటిష్టంగా ఉండాలి. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను అంచనా వేసుకొని ముందుకు వెళ్దామని, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేములవాడ నియోజకవర్గస్థాయి కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి పాల్గొన్నారు.
అనంతరం దేశపతి మాట్లాడుతూ..ప్రజలు బీఆర్ఎస్ను వద్దనుకోలేదు. 39 సీట్లతో చరిత్రలో ఇంత పెద్ద బలమైన ప్రతిపక్షం ఎప్పుడు కూడా లేదన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని సజీవంగా ఉంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన అవకాశంతో..మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ.. బండి సంజయ్ గెలుపొంది వేములవాడ నియోజకవర్గానికి ఏమీ ఒరగబెట్టేది లేదన్నారు. ప్రతి కార్యకర్త వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి వినోద్ కుమార్ను గెలిపించుకుందామన్నారు. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి అండగా నిలుస్తానని హామీనిచ్చారు.