హైదరాబాద్, ఆగస్ట్ 28 (నమస్తేతెలంగాణ): మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. కాగ్ రిపోర్ట్తో రేవంత్రెడ్డి తుగ్లక్ పాలన బట్టబయలైందని శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన తేల్చిచెప్పారు. 2026 జూలై కాగ్ రిపోర్ట్ను ఉటంకిస్తూ కాంగ్రెస్ డొల్లతనాన్ని ఆయన ఎండగట్టారు. 2026-27 బడ్జెట్ లెక్కలన్నీ పచ్చి మోసమని ఆరోపించారు. రేవంత్ సరార్ చెప్తున్న తెలంగాణ రైజింగ్, 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ముచ్చట్లన్నీ ఒట్టి బూటకమని తేల్చిచెప్పారు. అసెంబ్లీలో రూ.6,857 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని అబద్ధాలు చెప్పారని, తీరా చూస్తే కేవలం 120 రోజుల్లోనే రూ.19,266 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నట్టు తేలిందని తెలిపారు.
రోజువారీ పాలనకు ఖజానా నుంచి నెలకు రూ.4,816 కోట్లు ఆవిరైపోతున్నాయని పేర్కొన్నారు. ప్రాథమిక లోటు రూ.23,197 కోట్లకు (ఏడాది టార్గెట్లో 62.44%) చేరిందంటే అప్పు పుట్టకపోతే పూట గడువని పరిస్థితికి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు తెచ్చారని విమర్శించారు. 4 నెలల్లోనే ఏడాది మొత్తానికి ఉన్న నికర అప్పుల పరిమితి రూ.58,458 కోట్లయితే.. జూలై నాటికే రూ.33,730 కోట్లను (57.70%) ఊడ్చేశారని దుయ్యబట్టారు. బడ్జెట్లో పెన్షన్ల కోసం పెట్టిన దాంట్లో ఇప్పటికే 71.20% (రూ.10,492 కోట్లు) ఖర్చయిపోయింది. జీతాలు, నిర్వహణ ఖర్చులేమో రూ. 78,909 కోట్లకు(33.66%) ఎగబాకాయి. రాష్ట్రానికి ఆస్తులు సృ ష్టించే మూలధన వ్యయం మాత్రం రూ.9,272 కోట్లతో (19.62%) కునారిల్లుతున్నది’ అని పేర్కొన్నారు.
‘పన్నేతర ఆదాయం రావాల్సింది రూ.35,730 కోట్లు కాగా, వచ్చింది కేవలం రూ.4,274 కోట్లు (11.96%). ఇసుక, మైనింగ్, రాయల్టీల్లో భారీగా దోపిడీ జరుగుతున్నదని ఆరోపించారు. ఊరూరా మద్యం ఏరులై పారుతున్నా వచ్చిన ఎక్సైజ్ ఆదాయం రూ.6,965 కోట్లే (25.18%). ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన పైసలు మద్యం సిండికేట్ల జేబుల్లోకి పోతున్నాయి. ఇచ్చిన వాగ్దానాలను ఏ ఎనిధులతో నెరవేరుస్తారో స్పష్టమైన ఆర్థిక రోడ్ మ్యాప్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలోని ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను యాంగ్ ఇండియా సిల్స్ యూనివర్సిటీ (వైఐఎస్యూ)లో విలీనం చేయడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్కుమార్ ప్రశ్నించారు. విలీనంపై వైఐఎస్యూ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వెంటనే స్పందించి, విద్యార్థులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆనంద్ మహీంద్రాకు ఆయన శుక్రవారం బహిరంగ లేఖ రాశారు.
‘ప్రభుత్వం ఒకే రాత్రిలో 64 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, 63 ప్రభుత్వ ఐటీఐలు, 238 ప్రైవేట్ ఐటీఐలు, 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు.. ఇలా ఏటా లక్షకు పైగా సీట్లు ఉన్న పెద్ద వ్యవస్థను వైఐఎస్యూ కిందికి తెచ్చింది. ముందస్తు మౌలిక వసతుల ఆడిట్, ఫైనాన్షియల్ ప్లాన్, ఫ్యాకల్టీ మ్యాపింగ్ లేకుండా ఇది ఎలా సాధ్యం’ అని నిలదీశారు. ఇది ఒక రకమైన ప్రైవేటీకరణేనని ఆందోళన వ్యక్తంచేశారు.