మహబూబ్నగర్, మార్చి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగింది. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.
ఉమ్మడి జిల్లాలో 10 (నాగర్కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్నగర్, కొడంగల్, షాద్నగర్) పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 8 చోట్ల 100 శాతం, రెండు చోట్ల 99 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 1,439 మంది ఓటర్లకుగానూ 1,437 మంది (99.86 శాతం) ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి కొడంగల్ ఎంపీడీవో కార్యాలయంలో ఓటు వేశారు.
గద్వాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, మహబూబ్నగర్లో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితోపాటు అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలతోపాటు ప్రజాప్రతినిధులు ఓటు వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి పలు కేంద్రాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించారు. పోలీసులు కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రతి ఓటర్ను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే ఓటేసేందుకు అనుమతించారు.
కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ల వద్ద ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షించారు. బ్యాలెట్ పద్ధతిలో ప్రాధాన్య క్రమంలో ఓటేసే అవకాశం ఉండటంతో ప్రజాప్రతినిధులను పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి కూర్చోబెట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉప ఎన్నికల పోలింగ్ ఆయా జిల్లా ఎస్పీలతో కలిసి జోగులాంబ జోన్ డీఐజీ చౌహాన్ పర్యవేక్షించారు.
సొంత అన్న కొడుకు జీవన్రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నా మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాత్రం బీఆర్ఎస్కు కట్టుబడ్డారు. కుటుంబాలు ఒక్కటైనా.. పార్టీలు, సిద్ధాంతాలు వేరు అని నిరూపించారు. వనపర్తి జిల్లా అమడబాకుల ఎంపీటీసీ శేషిరెడ్డి తన కుమారుడి వివాహం హైదరాబాద్లో ఉదయం 10 గంటలకు జరిగిన తర్వాత హుటాహుటిన జిల్లాకేంద్రంలోని పోలింగ్ కేంద్రానికి పరుగెత్తుకొచ్చి ఒక్క నిమిషం ముందుగానే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హైదరాబాద్ దవాఖానలో చికిత్స పొందుతున్న ఏదుల నరేందర్ స్ట్రెచర్పై వనపర్తికి వచ్చి ఓటు వేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్లను సీల్ వేసి మహబూబ్నగర్లోని స్ట్రాంగ్రూంకు తరలించి భద్రపరిచారు. కాగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే కొన్ని కేంద్రాల వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మీడియాను అనుమతించకుండా కొద్దిసేపు బయటనే ఉంచారు.
సీఐపై ఎమ్మెల్యే బండ్ల ఆగ్రహం
గద్వాల కేంద్రం వద్ద ఉన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిని సీఐ అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దివ్యాంగురాలు వస్తుందని, ఆమె ఓటువేసిన వెంటనే వెళ్లిపోతామని ఎమ్మెల్యే చెప్పినా వినకపోవడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఓటు వేయడానికి వచ్చిన ప్రజాప్రతినిధులపై సైతం సీఐ భీమాకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెళ్లిపోతామని చెప్పినా ఎందుకలా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే నిలదీశారు.
ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా పోలీస్ సిబ్బంది సర్దిచెప్పి పంపించారు. అనంతరం పోలీసులు, పాత్రికేయుల మధ్య మాటలయుద్ధం జరిగింది. మరోవైపు పోలింగ్ కేంద్రం సమీపంలోనే అధికార పార్టీ నేతలు తచ్చాడుతున్నా పోలీసులు పట్టించుకోకపోవటం గమనార్హం. ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరుగుతున్న పోలింగ్ కేంద్రాల వద్ద అధికార పార్టీకి చెందిన కొంతమంది హల్చల్ చేశారు.
క్రాస్ ఓటింగ్ భయం
ఎమ్మెల్సీ ఉపఎన్నికతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లో టెన్షన్ మొదలైంది. రెండు పార్టీల అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకున్నది. ఎక్కడ జంపుజిలానీలు ఉన్నారో, చివరి నిమిషంలో ఎవరికి ఓటేశారో తెలియని పరిస్థితి నెలకొన్నది. చాలామంది స్థానిక ప్రజాప్రతినిధులు తమను పట్టించుకోలేదని, ఆయా పార్టీలను వదిలి ఇతర పార్టీల్లో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్కు సంఖ్యాబలం లేకున్నా జంపుజిలానీలతో పోటీకి దిగింది. కాగా అభ్యర్థిపై ఎమ్మెల్యేల అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. ఎమ్మెల్యేలు ఓటు వేసి వెళ్లిపోవటం, ఓటింగ్ సరళిని పట్టించుకోకపోవటంతో మిగతా నేతలు ఖంగుతిన్నారు. మొత్తంగా ఏప్రిల్ 2న జరిగే కౌంటింగ్లో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది.