బంజారాహిల్స్/నాంపల్లి క్రిమినల్ కోర్టు/మాదన్నపేట, డిసెంబర్ 8: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు కేసులో 45 రోజులపాటు రిమాండ్లో ఉన్న నిందితులు నందకుమార్, రామచంద్రభారతి గురువారం చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నిమిషాల వ్యవధిలోనే బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో నమోదైన కేసుల్లో మళ్లీ ఆ ఇద్దరు అరెస్టయ్యారు. బంజారాహిల్స్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సిందేర్కర్ సతీశ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని స్థలం వ్యవహారంలో కోరే నందకుమార్ అలియాస్ నందు బెదిరింపులకు గురిచేశాడు. నందకుమార్పై గత నెల 18న బాధితుడు సతీశ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నందకుమార్పై ఐపీసీ 386,387 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు.. గురువారం చంచల్గూడ జైలు నుంచి విడుదలైన నందకుమార్ను అరెస్టుచేశారు.
బోగస్ ఆధార్ కార్డు, పాన్ కార్డును, డ్రైవింగ్ లైసెన్స్లు తయారుచేసి మోసానికి పాల్పడుతున్న రామచంద్రభారతిపై చర్యలు తీసుకోవాలని నెల రోజుల క్రితం తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ పాస్పోర్టు ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ పొందడంతో ఆదాయపు పన్నుశాఖ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. కేసుల్లో రామచంద్రభారతిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు వీరిద్దరిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా రామచంద్రభారతికి న్యాయస్థానం రూ.10 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. నందకుమార్పై ఇంకా కేసులు పెండింగ్లో ఉండటంతో అతనికి న్యాయస్థానం 14 రోజు రిమాండ్ విధించింది.