జోగులాంబా గద్వాల : జిల్లాలో అనేక గ్రామాల్లో పంటలకు నీరందక ఎండిపోతున్నాయి. చేతికొచ్చే దశలో పంటలు నష్టపోవడం రైతాంగానికి ఆందోళన కలిగిస్తున్నదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (MLA Krishna Mohan Reddy), ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు( MLA Vijayudu) అన్నారు. రాష్ట్రంలో ఎండిన పంటలకు ఎకరాకు 25 వేలు నష్టపరిహారం(,Crop loss compensation), పంటలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్లో కలెక్టర్ కు వినతిపత్రం ఇచారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెంటనే గ్రామాల వారీగా పంటల నష్టాన్ని అంచనా వేయడానికి అధికారుల బృందాలను నియమించి యుద్ధ ప్రాతిపదికన నివేదికలు తెప్పించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామాల వారీగా వచ్చిన పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపి ఎకరాకు 25 వేల రూపాయల నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వరితో పాటు వివిధ పంటలకు మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో హామీ ఇచ్చి మోసం చేసింది. వెంటనే రైతులకు న్యాయం జరిగిలే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు ప్రతాప్, విజయ్, రాజారెడ్డి, జెడ్పిటిసి రాజశేఖర్, ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.