హైదరాబాద్ : ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో అడ్డంగా దొరికిపోయిన బీజేపీ దర్యాప్తు పేరిట టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే వివేకానంద ఆరోపించారు. బీజేపీకి పోయేకాలం దాపురించిందని బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మునుగోడు ఓటమి తరువాత టీఆర్ఎస్పై కక్షపూరితంగా ఈడీ, ఐటీ దాడులు చేయిస్తుందని మండిపడ్డారు. సీబీఐ, ఈడీ, ఐటీ లు బీజేపీ జేబు సంస్థలుగా మారిపోయాయని పేర్కొన్నారు.
మంత్రి మల్లారెడ్డి నివాసాల పై ఐటీ దాడుల కోసం రోజూ 40 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ దర్యాప్తు ముమ్మరం అయినందుకే ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ ఐటీ, ఈడీ దాడులకు పురిగొల్పుతోందని ఆరోపించారు. మోదీ కక్ష సాధింపు చర్యలను గట్టిగా ఎదుర్కొంటామని, దేనికి భయపడబోమని స్పష్టం చేశారు. బీఎల్ సంతోష్ కోసం బండి సంజయ్ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఆరోపించారు.సంతోష్ దేవుడా, దయ్యమా విచారణ సంస్థలు తేలుస్తాయని అన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో యాదగిరి గుట్టకు తడి బట్టలతో వెళ్లిన బండి సంజయ్కు బీఎల్ సంతోశ్ను విచారణకు పిలిస్తే అన్ని తడుస్తున్నాయని విమర్శించారు. ‘ హై కోర్టు చెప్పినా బీ ఎల్ సంతోష్ విచారణకు హాజరు కారా ? చట్టం అంటే బీజేపీ కి గౌరవం లేదా ? అని ప్రశ్నించారు. తెలంగాణ కు పెట్టుబడులు రావడం లేదని బండి సంజయ్ పచ్చి అబద్దాలు మాట్లాడారని, అమెజాన్ సంస్థ రూ. 35 వేల కోట్ల పెట్టుబడులకు ఒకే చెప్పిందని గుర్తు చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో తెలంగాణకు ఉపయోగపడే ఏ ఒక్క అంశాన్ని చర్చించలేదని , కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఎలాంటి చర్చించలేదని దుయ్యబట్టారు.