మోర్తాడ్/వేల్పూర్, జూలై 1: కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతుంటే సీఎం రేవంత్రెడ్డి మాత్రం ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. శిల్పకళా వేదికలో నిర్వహించింది రైతుల ఆశీర్వాదసభ కాదని, అది అన్నదాతల శాపనార్థాల సభ అని పేర్కొన్నారు. రైతులు రేవంత్రెడ్డిని ఎందుకు ఆశీర్వదించాలి? రుణమాఫీ చేయనందుకా? రైతుబంధు ఎగ్గొట్టినందుకా? వడ్లు కొననందుకా? యూరియా ఇవ్వనందుకా? కరంట్ కట్ చేసినందుకా? బోనస్ ఎగ్గొడుతున్నందుకా? అని ప్రశ్నించారు. బుధవారం ఆయన నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో మీడియాతో మాట్లాడారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి ఆర్భాటాలు, వృథా ఖర్చులు లేకుండా కేవలం ఒక ప్రెస్మీట్ ద్వారా ప్రకటించి, 11 సీజన్లలో రూ.73 వేల కోట్లు రైతుబంధు నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమచేశారని గుర్తుచేశారు. నాడు ఒక్క రూపాయి కూడా ప్రజాధనాన్ని వృథా చేయలేదని అన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సీజన్లలో మూడు సీజన్ల రైతుబంధు ఎగ్గొట్టి దాదాపు రూ.28 వేల కోట్లు రైతులకు బాకీ పడిందని తెలిపారు. రూ.28 వేల కోట్ల పాత బాకీలో నుంచి కేవలం రూ.2,500 కోట్లు విదిల్చి దానికోసం వందల కోట్లతో సభలు పెట్టి అట్టహాసం చేయడం హాస్యాస్పదమని అన్నారు.
సీఎం రేవంత్రెడ్డి తదుపరి ఇవ్వనున్నట్టు చెప్తున్న రూ.9 వేల కోట్లు కూడా రైతుల పాత బాకీల కిందికే వస్తాయని, కొత్తగా ఇస్తున్నదేమీ లేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇస్తే రైతులకు రూ.55 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని, కానీ ఇచ్చింది కేవలం రూ.27 వేల కోట్లేనని, ఇంకా రూ.28 వేల కోట్లకుపైగా రైతుబంధు నిధులను ప్రభుత్వం ఎగ్గొట్టిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రూ.2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తరువాత రైతుల నోట్లో మట్టి కొట్టిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.50 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా, కేవలం రూ.21 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకొన్నారని ధ్వజమెత్తారు.
రుణమాఫీ కాదు, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం మాఫీ అయ్యిందని ఎద్దేవా చేశారు. మంత్రి తుమ్మల ఏసీ రూముల్లో కూర్చుని యూరియా యాప్ బాగుందని, 90శాతం రైతులు సంతోషంగా ఉన్నారని మాట్లాడటం సరికాదని అన్నారు. ఇదే మాట గ్రామాల్లోకి వచ్చి రైతుల మధ్య నిలబడి చెబితే రైతులు.. ‘మీ గూబ గుయ్యుమనిపిస్తారు’ అని హెచ్చరించారు. మాట ఇస్తే తప్పను అని రేవంత్రెడ్డి అనడం ప్రపంచంలో 8వ వింత అని ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేస్తానని చెప్పి 900 రోజులైనా ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయకపోవడం మాట తప్పడం కాదా? ప్రశ్నించారు. రుణమాపీ విషయంలో దేవుళ్లందరిపైనా ఒట్లు పెట్టి మరీ అన్నదాతలను మోసం చేయడం మాట తప్పడం కాదా? అని నిలదీశారు.