ఉట్నూర్, ఫిబ్రవరి 21: పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హెచ్చరించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి సీతక్క జిల్లాకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ప్రతి సమావేశానికి ప్రతిపక్షాలను పిలుస్తూ అందరికీ సమాన గౌరవం ఇస్తున్నారని తెలిపారు. కరోనా సమయంలో గిరిజనులకు సేవచేస్తూ అందరి మన్నలను పొందారని గుర్తుచేశారు. అలాంటి నాయకురాలిపై ‘నమస్తే తెలంగాణ’ ఇసుక దందా పేరిట తప్పుడు వార్తలు రాస్తున్నదని మండిపడ్డారు. ఆ పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు గ్రామాల్లో నిషేధిస్తామని, పేపర్ను పాతాళానికి తొక్కేస్తామని, కాలుస్తామని అనుచిత వ్యాఖ్యలు చేశారు.