హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి బీజేపీ బీ టీమ్గా మారిందని ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి మాపై పోలీసు స్టేషన్లోనే ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. కోర్టులో కేసు విచారణలో ఉండగా, మళ్లీ కొత్తగా పీఎస్లో ఫిర్యాదు చేయడం ఏంటని ప్రశ్నించారు.
షెడ్యూల్ 10 ప్రకారమే తాము నాడు టీఆర్ఎస్లో విలీనం చేశామని తెలిపారు. రాజస్థాన్లో బీఎస్పీ ఎమ్మెల్యేలు సోనియా గాంధీ సమక్షంలో చేరలేదా? గోవాలో కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తే రేవంత్ రెడ్డికి తప్పుగా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఆనాడు టీడీపీకి రాజీనామా చేసిన లేఖను స్పీకర్కు ఇవ్వకుండా.. చంద్రబాబుకు ఎందుకు ఇచ్చారో చెప్పాలి? అని డిమాండ్ చేశారు.
టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన సమయంలో రేవంత్ రెడ్డి ముడుపులు తీసుకుంటే.. తాము తీసుకున్నట్లే అని తెలిపారు. రాజస్థాన్లో బీఎస్పీ ఎమ్మెల్యేలకు సోనియా గాంధీ ముడుపులు ఇస్తే.. తమకు కూడా ఇచ్చినట్లే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చి గవర్నర్ పాలనను పెట్టింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటుకు కేసులో అడ్డంగా కెమెరాలకు దొరికిన రేవంత్ రెడ్డి.. ఇవాళ తమపై ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
దేశంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తుంటే.. కాంగ్రెస్ నాయకులు మాత్రం కాంగ్రెస్ తోడో యాత్ర చేస్తున్నారు. బీజేపీని బలోపేతం చేసేందుకు రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ వీక్ అయిందన్నారు. రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొట్టే ఆనవాయితీని కాంగ్రెస్ నుంచి బీజేపీ కొనసాగిస్తోందన్నారు.
తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము ఆనాడు పార్టీ మారామని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్లో చేరాము కాబట్టే తమ అభివృద్ధి సాధ్యం అయిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు ఎక్కడైనా సిద్ధం అని సుధీర్ రెడ్డి చెప్పారు.