మహబూబాబాద్ : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. నెల్లికుదురు మండలం రావిరాల, వావిలాల గ్రామంలో గత ఐదు రోజులగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కూలిన ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..భారీ వర్షాల వల్ల గ్రామాల్లో చెరువులు అలుగు పోస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
వర్షాల వల్ల ఏదైనా సమస్య ఉన్నా, నా దృష్టికి లేదా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. గ్రామాల్లో నీళ్లు నిలిచిన చోట అధికారులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
అవసరమైతే తప్పా బయటకు రావొద్దన్నారు. వర్షాలు కురుస్తున్నప్పుడు చెట్ల కింద ఉండొద్దని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని అత్యవసర సమయాల్లో టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సహాయం పొంందవచ్చన్నారు.