ఆరుగురిని ఉన్మాది హతమార్చితే సీఎం రేవంత్ ఒక్క మాటైనా మాట్లాడలేదేం? ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని గొప్పలు చెప్పడం కాదు, ముందుగా వారిని కాపాడే బాధ్యత తీసుకోవాలి. రాష్ట్రంలో పోక్సో కేసులు పెరుగుతుంటే ఎందుకు రివ్యూ చేయడం లేదు. -సబిత
షాబాద్, జూలై 12: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆరు వరుస హత్యలపై సీఎం రేవంత్రెడ్డి ఎందుకు స్పందించలేదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో బాధిత కుటుంబాన్ని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డితో కలిసి ఆదివారం ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబంలో మిగిలిన బాలిక సోదరి మేఘన(దివ్యాంగురాలు)తో మాట్లాడారు. షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి ఇచ్చిన రూ. 5లక్షల చెక్కును ఆమెకు అందజేశారు. అనంతరం మాజీ మంత్రి సబిత మాట్లాడుతూ పోక్సో కేసు నిందితులపై సీఎంకు అంత ప్రేమెందుకని నిలదీశారు. ఘటనకు పోలీస్శాఖ, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం కాదా అని ప్రశ్నించారు. బాధితులు ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు స్పందించి ఉంటే ఇంత మంది ప్రాణాలు పోయేవి కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రే హోం మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఘటనకు ఆయన బాధ్యత వహించాల్సిందేనని పేర్కొన్నారు. నలుగురు ఆడబిడ్డల గొంతులు కోయడం రాష్ట్రంలో భయాందోళన సృష్టిస్తే సీఎంగా ఉన్న రేవంత్ కనీసం ఒక్క మాట మాట్లాడకపోవడం ఏందని నిలదీశారు.
ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని గొప్పలు చెప్పడం కాదని, ముందుగా వారిని కాపాడే బాధ్యత తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పోక్సో కేసులు అత్యధికంగా నమోదవుతుంటే. సీఎం సహా పోలీస్ ఉన్నతాధికారులు ఎందుకు రివ్యూ చేయడం లేదని ప్రశ్నించారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని సీఎం ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారని, మన సీఎంకు ఏమైందని నిలదీశారు. బాధిత కుటుంబానికి చెందిన యువతి పేరిట తక్షణమే రూ.కోటి డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని అమ్మాయిని అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిందితుడిని తక్షణమే పట్టుకోవాలని కోరారు. రాష్ట్రమంతా ఈ ఘటనతో కలకలం రేగితే.. సీఎం మాత్రం మీడియా ముందుకు వచ్చి బీఆర్ఎస్ నేతలపై తిట్ల పురాణం అందుకున్నారని మండిపడ్డారు. కనీసం సంతాపం తెలియజేసి, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని నోటి మాటగా కూడా చెప్పకపోవడం దారుణమని విమర్శించారు. కార్యక్రమంలో డీసీఎంఏస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేశమళ్ల ఆంజనేయులు, చల్లా శేఖర్రెడ్డి, జడల రాజేందర్గౌడ్ తదితరులు పాలొన్నారు.