హైదరాబాద్: ఏ పేపర్ లీక్ (Paper Leak) అయినా.. దాని వెనుక బండి సంజయ్ (Bandi Sanjay) హస్తం ఉందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు (Rega Kantha rao) అన్నారు. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు, నీచ రాజకీయాలకు బీజేపీ (BJP) కేరాఫ్ అడ్రస్గా మారిందని విమర్శించారు. పేపర్ లీక్ చేసినవారెవరినీ వదిలేప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పేపర్ లీకేజ్ పాపం బండి సంజయ్దేనని ఆరోపించారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని సూచించారు. యువత అప్రమత్తంగా ఉండాలని, బీజేపీ కుట్రలను ఛేదిస్తామని స్పష్టం చేశారు. ఉత్తరాదిన చేసినట్లు చేయాలనుకుంటే తెలంగాణలో కుదరదని హెచ్చరించారు.
పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ (Hindi Paper) వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని కరీంనగర్లోని తన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అక్కడి నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని బొమ్మలరామారం పోలీస్ స్టేషన్కు తరలించిన విషయం తెలిసిందే.
ఇటీవల టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ వెనుక బీజేపీ హస్తం ఉన్నదని అనుమానాలు రాగా, మంగళవారం నాటి హిందీ పేపర్ లీకేజీతో కుట్ర మొత్తం బీజేపీ కనుసన్నల్లోనే సాగుతున్నదని విస్పష్టంగా బయటపడింది. ఇందుకోసం బీజేపీ తన పార్టీతోపాటు సంఘ్ కార్యకర్తలు, పార్టీ సానుభూతిపరులను వాడుకొంటున్నట్టుగా వరుస ఘటనలను చూస్తే స్పష్టంగా అర్థమవుతున్నది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితుడు రాజశేఖర్రెడ్డి బీజేపీ సానుభూతిపరుడుకాగా, పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం బయటకు తెచ్చిన నిందితుడు ఏకంగా బీజేపీ నేతలందరితో సన్నిహిత సంబంధాలున్న కీలక కార్యకర్త. తెలుగు పేపర్ లీకేజీ పాత్రధారులు కూడా బీజేపీకి అనుకూలురని చెప్తున్నారు. హిందీ పేపర్ లీకేజీ నిందితుడు బూరం ప్రశాంత్ను విడుదల చేయాలంటూ బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వరంగల్ కమిషనరేట్ వద్ద ఆందోళన చేయడం బీజేపీకి, నిందితుడికి మధ్య సంబంధాలను తేటతెల్లం చేస్తున్నది.
మంగళవారం కమలాపూర్ నియోజకవర్గంలో పరీక్ష జరుగుతుండగానే పదో తరగతి హిందీ ప్రశ్నపత్రాన్ని బయటకు తెచ్చిన వ్యవహారం కూడా బీజేపీ కుట్రేనని స్పష్టంగా తేలిపోయింది. పేపర్ బయటకు వచ్చింది బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గమైన జగిత్యాల జిల్లా కమలాపూర్లో. ప్రధాన నిందితుడు బూరం ప్రశాంత్ బీజేపీ నేతలకు సన్నిహితుడు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి అనుచరుడు, ఆ పార్టీలో కీలక కార్యకర్త. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ కే లక్ష్మణ్, మాజీ ఎంపీ, గవర్నర్ దత్తాత్రేయ వంటి నేతలతో అతడికి పరిచయాలున్నట్టు తెలస్తున్నది. దీనిని బట్టి ఈ లీకేజీలు మొత్తం బండి సంజయ్ నేతృత్వంలోనే సాగుతున్నాయని, బీజేపీ శ్రేణులే సహాయం చేస్తున్నాయని స్పష్టమైనట్టు విద్యారంగ నిపుణులు చెప్తున్నారు.
పోలీసులు బయటపెట్టిన వివరాలను బట్టి చూస్తే బూరం ప్రశాంత్ ఓ బాలుడిని రెచ్చగొట్టి కమలాపూర్ నియోజకవర్గం ఉప్పల్లోని ప్రభుత్వ స్కూల్ పరీక్ష కేంద్రం నుంచి ప్రశ్న పత్రాన్ని బయటికి తెప్పించాడు. ఆ తర్వాత ఉదయం 10:46 గంటల నుంచి వాట్సాప్ గ్రూపులకు చేరవేశాడు. పేపర్ లీక్ అయ్యిందని స్వయంగా బ్రేకింగ్ న్యూస్ అంటూ వార్త రాసి వరంగల్ మీడియా గ్రూపుల్లో వేశాడు. హైదరాబాద్లోని పలువురు బ్యూరో ఇన్చార్జిలకు సైతం బ్రేకింగ్ న్యూస్ అంటూ పంపించాడు. ఉదయం 11:10 గంటలకు ప్రశాంత్ స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి వాట్సాప్లో హిందీ పేపర్ను పంపించాడు. ప్రశ్నపత్రం తన చేతికి వచ్చిన తర్వాత రెండుగంటల వ్యవధిలో ప్రశాంత్ ఏకంగా 142 ఫోన్ కాల్స్ మాట్లాడాడు. పేపర్ లీకైనట్టు వార్తలు ప్రసారం చేయాలని మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి చెప్పాడు. వందలమంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా బృందాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సమాచారాన్ని చేరవేసి, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగేలా చేశాడు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెచ్చేలా వాట్సాప్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియాలో స్క్రిప్టులు రాసి పోస్టు చేశారు.