కరీంనగర్ : సీఎం కేసీఆర్ అడగకుండానే పెద్ద మొత్తంలో మానకొండూరు నియోజకవర్గానికి నిధులు కేటాయించి ఎంతో అభివృద్ధి చేశారని మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్(MLA Rasamayi )అన్నారు. సోమవారం నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గతంలో నియోజకవర్గం ఎలా ఉండోదో ఇప్పుడు ఎలా ఉందో ఆలోచన చేయాలన్నారు.
గతంలో మానకొండూరు ఎగువ భాగంలో పత్తిపెట్టి మొగులుకు ముఖం పెట్టి వానమ్మ కోసం ఎదురు చూసెటోళ్లు. ఒకవేళ వానరాకుంటే పత్తి పగిలినట్లు రైతుల గుండెలు పగిలి ఎంతో మంది చనిపోయేవారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు సీఎం కేసీఆర్ కాళేశ్వరంతో ప్రాజెక్ట్ నిర్మించడంతో పత్తి చేలతో పాటు వరి పండిస్తూ రైతులు సంతోషంగా ఉన్నారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ రైతులకు భరోసా ఇచ్చిందని స్పష్టం చేశారు. మానకొండూరు, ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో యాభై పడకల దవాఖానలు నిర్మించామన్నారు. నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టి మరింత అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ను కోరారు. అలాగే అభివృద్ధిని చూసి మరోసారి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.