సంగారెడ్డి : ఈటల రాజేందర్కు చెందిన జమున హేచరీస్పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం జిల్లాలోని అందోల్ క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..హేచరీస్ ఏర్పాటు చేసిన భూముల్లో తమ సీలింగ్ భూములున్నాయి.
మాకు ఈటల అన్యాయం చేశారని ఫిర్యాదు చేయడంతోనే అధికారులు భూములు సర్వే చేపట్టాలని నిర్ణయించారన్నారు. ఈటల రాజేందర్ ఈ విషయంపై కోర్టును ఆశ్రయించగా భూములు విషయంలో ఎలాంటి తప్పిదాలు జరగనప్పుడు భూములు సర్వే చేస్తే మీకు ఏంటి నష్టమంటూ కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందన్నారు. అయితే కరోనా కారణంగా అప్పుడూ భూముల సర్వే నిలిచిపోయిందని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. ఇప్పుడూ భూములు సర్వే జరుగుతున్నదని చెప్పారు.
ఇవన్నీ మరిచి బీజేపీ నేతలు ఉప ఎన్నికల్లో ఈటల విజయం సాధించడంతో ఆయనపై కక్షసాధింపుగా భూములు సర్వే చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అనడం మతిలేని చర్య అన్నారు. మరీ ఇంతా దిగజారుడు రాజీకీయం చేయకూడదని బీజేపీ నేతలకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ హితువు పలికారు.