MLA Raghunandan Rao | దుబ్బాక, అక్టోబర్19: దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావుకు ప్రజల నుంచి చుక్కెదురైంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా.. మళ్లీ మా గ్రామాలకు ఎందుకొచ్చావని నిలదీశారు. దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా రఘనందన్రావు నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా.. గురువారం రాయపోల్ మండలం వీరానగర్, రాంసాగర్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు, మహిళలు ఆయనను అడ్డుకున్నారు. నిరుద్యోగ యువతకు భృతి, రైతులకు జోడెడ్లు, నాగలి, నిరుపేద వధువు వివాహానికి ఆర్థిక సహాయం, కేంద్ర ప్రభుత్వం నుంచి దుబ్బాకలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశం కల్పిస్తానంటూ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఉప ఎన్నికల్లో నోటికొచ్చిన హామీలిచ్చి ఓట్లు వేయించుకుని తమను మోసం చేశావంటూ గ్రామస్థులు ఆగ్రహించారు. తమ గ్రామంలో బీజేపీ ప్రచారం నిర్వహించవద్దని అడ్డుకున్నారు. చేసేదేమిలేక ఎమ్మెల్యే రఘునందన్రావు ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించుకుని వెళ్లిపోయారు. ఆనంతరం రాంసాగర్ గ్రామంలో కూడా ఆయనకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఓట్ల కోసం తప్ప బీజేపీ నాయకులకు అభివృద్ధి సోయి లేదని గ్రామస్థులు మండిపడ్డారు. పది రోజుల కిందట దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు చీరలు, గొడుగులు పంపిణీ చేశారు. ఈ విషయంపై రాంసాగర్కు చెందిన మహిళలు ఎమ్మెల్యే తీరుపై రుసరుసలాడారు. గ్రామాల్లో బీజేపీ నాయకులు చీరలు పంచి తమ ఇండ్లలో గొడవలకు దారి తీశారంటూ కొందరు మహిళలు తిట్టిపోశారు. చీరలకు ఆశపడి బీజేపీకి ఓట్లు వేయాలా? అని మరికొందరూ మహిళలు ప్రశ్నించారు. ఎమ్మెల్యే వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో.. ఎన్నికల ప్రచారం చేయకుండానే వెళ్లిపోయారు.