వేల్పూర్, మార్చి 3 : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ప్రవహించే కప్పలవాగు, పెద్దవాగులో (Peddavagu)ప్యాకేజీ-21 ద్వారా ఏర్పాటు చేసిన అవుట్లెట్లతో నీరందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి(MLA Prashanth Reddy) అన్నారు. ఆదివారం సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. వాగు పరీవాహక గ్రామాల రైతుల కోరిక మేరకు గడిచిన 20రోజుల క్రితమే ఇరిగేషన్ సీఈతో ఫోన్లో మాట్లాడామని, అంతేగాకుండా నీళ్లు వదలాలని ఎమ్మెల్యేగా లెటర్ ద్వారా కూడా విన్నవించామన్నారు.
అధికారులు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, నీటి విడుదల విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారని వివరించారు. ఇప్పటికైనా వాగుల్లోకి నీటిని వదలకపోతే ఆ రెండు వాగుల వెంట ఉన్న గ్రామాలకు చెందిన పంటలు ఎండిపోయే అవకాశమున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
మొదటి విడుతగా రోజుకు 300 క్యూసెక్కుల చొప్పున 10రోజులు 0.5టీఎంసీ నీరు వదలాలని ఎమ్మెల్యే వేముల డిమాండ్ చేశారు. రెండు రోజులు వేచిచూసి ప్రభుత్వం నీళ్లు వదలకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పరీవాహక గ్రామాల రైతులతో కలిసి తాను ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.