వేల్పూర్, మార్చి 3: బాల్కొండ నియోజకవర్గంలో ప్రవహించే కప్పలవాగు, పెద్దవాగులో ప్యాకేజీ-21 ద్వారా ఏర్పాటు చేసిన అవుట్లెట్లతో నీరందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కోరారు. ఆదివారం సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. వాగు పరీవాహక గ్రామాల రైతుల కోరిక మేరకు గడిచిన 20 రోజుల క్రితమే ఇరిగేషన్ సీఈతో ఫోన్లో మాట్లాడటమేగాక, నీళ్లు వదలాలని ఎమ్మెల్యేగా లేఖ అందజేసినట్టు చెప్పారు.
అధికారులు కూడా సర్కార్కు ప్రతిపాదనలు పంపించామని, నీటి విడుదల విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా వాగుల్లోకి నీటిని వదలకపోతే ఆ రెండు వాగుల వెంట ఉన్న గ్రామాలకు చెందిన పంటలు ఎండిపోయే అవకాశమున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. మొదటి విడతగా రోజుకు 300 క్యూసెక్కుల చొప్పున 10 రోజులు 0.5 టీఎంసీ నీరు వదలాలని ఎమ్మెల్యే వేముల డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో ప్రభుత్వం నీళ్లు వదలకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పరీవాహక గ్రామాల రైతులతో కలిసి ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.