సిద్దిపేట : దుబ్బాక(Dubbaka) అభివృద్ధితోపాటు ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(MLA Prabhakar Reddy) స్పష్టం చేశారు. ప్రధానంగా రైతులకు మల్లన్న కాల్వల ద్వారా సాగునీటిని అందించేందుకే ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం వరకు దుబ్బాక మండలంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేపట్టారు. మొదట పోతారం, గంభీర్పూర్, అచ్చమాయపల్లి గ్రామాల్లో 4 ఎల్ మల్లన్న కాలువల నిర్మాణ పనులను పర్యవేక్షించారు.
పలు కారణాలతో పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు ఆయన ఆదేశించారు.
పదిహేను కిలోమీటర్లు మేరా కాల్వల నిర్మాణ పనుల డిజైన్ ను పరిశీలించారు. అనంతరం దుబ్బాక పట్టణంలో పోస్ట్ ఆఫీస్ నుంచి రాజపేట వరకు నిర్మించ తలపెట్టిన ఆర్ అండ్ బి రోడ్డు పనుల గురించి ఆరా తీశారు. దుబ్బాక కేసీఆర్ బడిలో జూనియర్ కళాశాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిశీలించారు.