కోటగిరి/వర్ని, ఏప్రిల్ 12: వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి, వర్ని, చందూర్ మండలాల్లో ఇటీవల కురిసిన వడగండ్ల వానతో దెబ్బతిన్న పంట పొలాలను ఆయన శుక్రవారం పరిశీలించారు.
నాలుగు రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన వరి పంట దెబ్బతిన్నదని, రైతుల బాధ చూస్తుంటే ఒక రైతుగా తాను తట్టుకోలేకపోతున్నా అని చెప్పారు. వ్యవసాయాధికారులు సర్వే చేసి పంట నష్టం వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని సూచించారు. చేతికొచ్చిన పంట నష్టపోయిన రైతుకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని పోచారం డిమాండ్ చేశారు.