బాన్సువాడ/గాంధారి/బిచ్కుంద, ఏప్రిల్ 15: ‘బాన్సువాడ పోచారం అడ్డా.. కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. అనవసరంగా రెచ్చగొడితే మీ అడ్రస్సులు గల్లంతవుతాయి..’ అని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. దొంగ హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, గాంధారి, బిచ్కుందలలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత సమావేశంలో పోచారం మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్రెడ్డి మాటలు విని ప్రజలు మో సపోయి కాంగ్రెస్కు ఓటేశారని, ఇప్పుడు ఆ పార్టీ తీరును చూసి ప్రజలు బాధ పడుతున్నారని తెలిపారు. డిసెంబర్ 9న చేస్తామన్న రుణమాఫీ ఏమైంది? కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు ఇస్తామన్న తులం బంగారం ఎటుపోయింది? ఆడబిడ్డలందరికీ ఇస్తామన్న రూ.2500 సా యం, నిరుద్యోగ భృతి ఏమైంది? అని పోచారం ప్రశ్నించారు. ఇందులో ఏ ఒక్క హామీ అమలు చేసినట్టు నిరూపించినా రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. రూ.15 వేల రైతుబంధు అంటిరి.. వడ్లకు రూ.500 బోనస్ అంటిరి.. పింఛన్లు పెంచతామంటిరి.. వాటిని ఎప్పుడు అమలు చేస్తారు? అని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి గాలి అనిల్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, జనార్దన్గౌడ్, బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి పోచారం భాస్కర్రెడ్డి, రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.