హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఓ సీమటపాకాయ్ అని ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఎద్దేవా చేశారు. తాను పెద్దపెద్ద బాంబులనే ఎదుర్కొన్నానని అన్నారు. రేవంత్రెడ్డికి భయపడేది లేదని తేల్చిచెప్పారు. తనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టు రేవంత్ వ్యాఖ్యలున్నాయని విమర్శించారు. శుక్రవారం తన నివాసంలో రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తనపై టీపీసీసీ ఫిర్యాదు చేయటం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. పార్టీ మార్పుపై గతంలోనే కాంగ్రెస్ తమపై కోర్టుల్లో కేసులు వేసిందని, రేవంత్రెడ్డి కొత్తగా ఏమీ సాధించలేరని తెలిపారు. కేసుల విషయంలో బీజేపీకి కాంగ్రెస్ వత్తాసు పలుకుతున్నదని వ్యాఖ్యానించారు. రేవంత్కు చేతనైతే ముందు తన పార్టీలో అంతర్గత వ్యవహారాన్ని చక్కదిద్దుకోవాలని హితవు చెప్పారు. రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ అని మండిపడ్డారు. 12 మంది ఎమ్మెల్యేలపై ఆయన చేసిన వ్యాఖ్యల్లో నిజంలేదని కొట్టిపారేశారు. చట్టబద్దంగానే కాంగ్రెస్ను టీఆర్ఎస్లో విలీనం చేశామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల ఎర కేసులో తన వద్ద అన్ని ఆధారాలున్నాయని చెప్పారు.
దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే తాను అడ్డుకున్నానని, అదే రేవంత్రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ అని ధ్వజమెత్తారు. రేవంత్ గుణం తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఆనాడే జడ్పీటీసీ టికెట్ ఇవ్వలేదని తెలిపారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారమే పార్టీ మారామని, దాన్ని రేవంత్ చదువుకోవాలని సూచించారు. తమను ఎన్నుకొన్న ప్రజలు, ప్రాంత అభివృద్ధి కోసమే పార్టీ మారామని తేల్చి చెప్పారు. ఏ లాభం కోసం టీడీపీని వదిలి కాంగ్రెస్లో చేరారో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన పీసీసీ చీఫ్ అయ్యాకే కాంగ్రెస్ రెండు ఎన్నికల్లో ఓటమి పాలైందని విమర్శించారు. ఆయనపై వస్తున్న వ్యతిరేకతను దృష్టి మరల్చేందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసింది.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నడుం బిగించింది తానేనని ఎమ్మెల్యే రోహిత్రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే ఎర కేసును సిట్ దర్యాప్తు చేస్తే తమ గుట్టు రట్టు అవుతుందనే సీబీఐకి ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసిందని అన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుతో బీజేపీకి సంబంధం లేకపోతే, వారి లీగల్ టీం ఎందుకు కోర్టులో వాదిస్తున్నదని ప్రశ్నించారు. న్యాయస్థానాలపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉన్నదని, తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని పేర్కొన్నారు.