Viral News | దుగ్గొండి, మార్చి 31: వాళ్లిద్దరూ కవల పిల్లలు. వారిది నిరుపేద కుటుంబం. ఒకేరోజు.. ఒకే వేదికపై వారి పెండ్లి ఘనంగా జరిగింది. ఇద్దరి పెండ్లికి సీఎం కేసీఆర్ మానసపుత్రిక కల్యాణలక్ష్మి పథకం అండగా నిలిచింది. ఆ కుటుంబాన్ని ఆర్థికభారం నుంచి గట్టెక్కించింది. ఇద్దరూ కొన్ని రోజుల వ్యధిలోనే గర్భందాల్చారు. ఒకేరోజు ఒకే ప్రభుత్వ దవాఖానలో పండంటి మగపిల్లలకు జన్మనిచ్చారు. ఈ సారికూడా సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ వారికి ఆసరాగా నిలిచింది. కేసీఆర్ కిట్ అందుకొని ఆ కవలలిద్దరూ మురిసిపోయారు.
వివరాల్లోకెళితే, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన బొంత సారయ్య-కొమురమ్మ దంపతులకు ఇద్దరు కవల పిల్లలున్నారు. వారికి నిరుడు ఒకే వేదికపై వివాహం జరిగింది. వారి పెండ్లికి కల్యాణలక్ష్మి సాయం అందింది. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చేతుల మీదుగా వారు కల్యాణలక్ష్మి చెక్కులను అందుకొన్నారు. ఏడాది తర్వాత ఈ నెల 29న నర్సంపేట దవాఖానలో ఒకేరోజు ప్రసవించారు. ఇద్దరూ మగబిడ్డలకు జన్మనిచ్చారు. విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి దవాఖానకు వెళ్లి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ కిట్లను అందజేయగా, వారు ఆనందంతో సీఎం కేసీఆర్కు, తెలంగాణ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ పేదింట్లో ఆడబిడ్డ భారంకాకుండా తెలంగాణ సర్కారు పెండ్లికి, కాన్పులకు కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్లాంటి పథకాలతో అండగా నిలుస్తున్నదని పేర్కొన్నారు.