హైదరాబాద్: ఒక నెల ఒకటో తేదీన జీతాలివ్వడమే ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (MLA Payal Shankar) విమర్శిచారు. జీతాలే కాదు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎవరు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగంలో హామీలను ఎలా అమలుచేస్తారో చెబితే బాగుండేదన్నారు. ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడమే ప్రభుత్వ విజయం కాదని చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చలో భాగంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తును సూచిస్తుందని, అలాంటిది కొన్ని హామీలనే ప్రస్తావించారని విమర్శించారు. ఆరు గ్యారంటీలు తప్ప మిగిలినవి పట్టించుకోం అనేలా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు.
ఆరోగ్యశ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంచామన్నారని, అయితే అది అమలుకు నోచుకోలేదని చెప్పారు. ఆరోగ్యశ్రీలో 60 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఆరోగ్య శ్రీ బాధితులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారని వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన వాళ్లను గుర్తుచేసుకోవడం మంచిది. గవర్నర్ ప్రసంగంలో మన్మోహన్ సింగ్, సోనియాను గుర్తుచేసుకున్నారని, కానీ తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన బీజేపీని విస్మరించారని విమర్శించారు. ఇదంతా ప్రభుత్వ సంకుచిత స్వభావానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం సీఎంలా చురుగ్గా లేదని ఎద్దేవా చేశారు.