చేర్యాల, మార్చి 13 : తపాస్పల్లి, లద్నూరు రిజర్వాయర్లకు ప్రభుత్వం వెంటనే గోదావరి జలాలు పంపింగ్ చేసి చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలంలోని చెరువులు, కుంటలు నింపి రైతుల పంటలు కాపాడాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి(MLA Palla) డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్రెడ్డి, ఆయన కుమారులు చేపడుతున్న పనులపై ఫైర్ అయ్యారు.
రైతులను ఆదుకునే మనసు కాంగ్రెస్ సర్కారుకు లేదన్నారు. గోదావరి జలాలలు అందుబాటులో ఉన్నప్పటికి ఎందుకు తపాస్పల్లి, లద్నూరు రిజర్వాయర్ నింపడం లేదని ప్రశ్నించారు. సంబంధిత అధికారులు వెంటనే రిజర్వాయర్లు నింపి చెరువులు, కుంటలకు నీల్లు విడుదల చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మంత్రి కేటీఆర్ ద్వారా జీవో నెం.824 ద్వారా చేర్యాల మున్సిపాలిటీకి రూ.10కోట్లు, జనగామ మున్సిపాలిటీకి రూ.25కోట్లు తాను మంజూరు చేయించానని చెప్పారు.
అవే నిధులతో ఓటమి పాలైన నాయకులు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులు గ్రామాల్లో, పట్టణాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ఇతరులను బెదిరిస్తే బయపడేది లేదని అన్నివర్గాలను బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.