హైదరాబాద్: తెలంగాణను ఎవ్వరు ఇవ్వలేదని, కొట్లాడి తెచ్చుకున్నామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారని స్పష్టం చేశారు. ప్రగతి భవన్కు కంచెలు పెట్టామన్న కాంగ్రెస్.. అసెంబ్లీ ముందు కొత్త కంచెలు పెట్టిందని ఆరోపించారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు తీసుకోవద్దంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని వెల్లడించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. మార్పు అంటే నంబర్ ప్లేట్లు మార్చడం కాదని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎరికైనా రూ.10 లక్షలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు.
గవర్నర్తో ముప్ఫై మోసాలు, అరవై అబద్ధాలు చెప్పించారని విమర్శిచారు. గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. మేనిఫెస్టోలోని అంశాలు గవర్నర్ ప్రసంగంలో లేవని, హామీ ఊసే లేదన్నారు. ప్రగతి భవన్ గతంలో కూడా ప్రజా భవనేనని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రగతి భవన్లో ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు తీర్చింది ప్రగతి భవనే అన్నారు. సీఎం రేవంత్ కనీసం వారానికి ఒక్కసారి కూడా ప్రజావాణికి హాజరుకాలేదని విమర్శించారు. ఆరు గ్యారంటీల గురించి కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటుందని, గవర్నర్ ప్రసంగంలో కూడా అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక గ్యారంటీలో ఒక పథకాన్ని మాత్రమే అమలు చేశారన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.20 కోట్లు ఖర్చు చేస్తే రూ.60 కోట్లు ప్రచారం చేసుకున్నారని ఎద్దేశా చేశారు.
13 అంశాల్లో కేవలం రెండు మాత్రమే అమలుచేశారని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సులిచ్చారు.. బస్సుల సంఖ్య పెంచలేదు, ట్రిప్పులు పెంచలేదని విమర్శించారు. ప్రమాణ స్వీకారం రోజునే రైతు రుణమాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని తాము అడుగుతున్నామని చెప్పారు. ఆరున్నర లక్షల మందికిపైగా ఆటో డ్రైవర్ల జీవితాలు ప్రమాదంలో పడ్డాయన్నారు. రెండు నెలల్లో 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.