జనగామ: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) కబడ్డీ ఆడారు. కూత పెట్టి ఆయన కోర్టులోకి దిగారు. కబడ్డీ కబడ్డీ అంటూ మైదానంలో జోష్ పుట్టించారు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో జరిగింది. పట్టణంలోని ధర్మకంచె ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అండర్ -14 బాలుర బాలికల విభాగంలో జరిగిన కబడ్డీ రాష్ట్ర స్థాయి ముగింపు పోటీల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్లా కబడ్డీ..కబడ్డీ అంటూ కూతబెట్టి ఆట ఆడి క్రీడాకారులలో ఉత్సాహం నింపారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారు రాణించేలా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే పల్లా తెలిపారు.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. విద్యార్థి దశ నుంచే ఆటల పట్ల ఆసక్తిని పెంపొందించుకుని, నైపుణ్యంతో క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. జిల్లా నుంచి పోటీలకు అర్హత సాధించే విద్యార్థులకు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే పల్లా పేర్కొన్నారు.
అధికారులు, ఉపాధ్యాయులు, ఎమ్మెల్యే పల్లాకి మెమోంటో అందజేసి సన్మానం చేశారు. సంప్రదాయ నృత్య ప్రదర్శన చేసిన చిన్నారితో పాటు విద్యార్థినులను ఎమ్మెల్యే పల్లా అభినందించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందచేశారు.