హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): తనపై, తన కుటుంబసభ్యులపై కాంగ్రెస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని జనగామ ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, బొల్లం మల్లయ్యయాదవ్, పార్టీ నేతలు క్యామ మల్లేశం, దరువు ఎల్లన్న, తుంగబాలు తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తన సతీమణి నీలిమపై కాంగ్రెస్ పా ర్టీ అధికార ప్రతినిధి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నీలిమ తన ఉద్యోగానికి రాజీనామా చేశారని, అంతకుముందు బీఆర్ఎస్ సర్కార్లో దొడ్డిదారిన ఆమె ఉద్యోగం సంపాదించారని మల్లన్న పేర్కొనటాన్ని పల్లా తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి రాష్ర్టంలో నిర్వహించిన ఎంసెట్లో స్టేట్ ర్యాంకు సాధించిన నీలిమ 1992లోనే ఏపీఎస్ఈబీలో ఉద్యోగం తెచ్చుకున్నారని, అప్పుడు బీఆర్ఎస్ సర్కార్ ఉందా? అని ప్రశ్నించారు. 2015 లోనే డివిజనల్ ఇంజినీర్గా పదోన్నతి పొందారని, విద్యుత్తుసౌధ, కల్వకుర్తి, మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లో పనిచేశారని చెప్పారు.
ఆ తరువాత ఆరునెలలపాటు డిప్యుటేషన్పై రాష్ట్ర సచివాలయంలో కూడా పనిచేశారని తెలిపారు. 2016 నుంచి 2020 వరకు నీలిమ వేతనరహిత సెలవులో ఉన్నారని వివరించారు. 2020 నవంబర్ 19న వీఆర్ఎస్ తీసుకొని ప్రస్తుతం తమ అనురాగ్ విద్యాసంస్థలకు సీఈవోగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తీన్మార్ మల్లన్న సోదరుడు తమ విద్యాసంస్థల వద్దకు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నాడని చెప్పారు. తమ విద్యాసంస్థల్లో అక్రమాలు లేకపోయినా ఉద్దేశపూర్వకంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మం డిపడ్డారు. తమ కుటుంబంపై చేసిన అసత్యప్రచారానికి పరువునష్టం దావా వేస్తామని చెప్పారు.
మల్లన్నపై ప్రజావాణిలో ఫిర్యాదులు
‘కాంగ్రెస్ అధికార ప్రతినిధి హోదాలో తీన్మార్ మల్లన్న పనిగట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకుల కుటుంబాలపై అబద్ధాలు ప్రచారం చేయటమే విధానంగా పెట్టుకున్నారా? దీనిపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి’ అని పల్లా డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్న తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఇటీవలి ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు వచ్చాయని వాటిపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందా? లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, తనపై జనగామలో పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థి అధికారులను బెదిరిస్తూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆరోపించారు. అనురాగ్ యూనివర్సిటీకి ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు.
కక్షసాధింపుకు పాల్పడితే ఊరుకోం: బాల్క
అధికారం చేపట్టిన మరుక్షణం నుంచే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. తుంగతుర్తిలో సురేశ్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను, ఆయన భా ర్యను కాంగ్రెస్ వాళ్లు కొట్టారని, కొల్లాపూర్ నియోజకవర్గంలో మరో కార్యకర్తను హత్యచేశారని తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంత నేతలకు ప్రాణహాని ఉన్నదని, వారి గన్మెన్లను ఉపసంహరించడం కక్షపూరిత చర్య అని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల ఫోన్లను ట్యాప్చేసి వింటున్నారని ఆరోపించారు.