గంగాధర, ఫిబ్రవరి 3: కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి విమర్శించారు. ఆ పార్టీ ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో శనివారం నిర్వహించిన చొప్పదండి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాజీ ఎంపీ వినోద్కుమార్తో కలిసి మల్లారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ వన్గా నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయని చెప్పారు. మిషన్ కాకతీయ కింద రాష్ట్రంలోని 40 వేల చెరువులకు పూర్వవైభవం తెచ్చి, కోటి ఎకరాలకు సాగు నీరందించారని గుర్తుచేశారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని మొండిసంజయ్ అనుకోవాలని, ఉత్తమాటలు తప్ప నిధులు తీసుకురావడం ఆయనకు తెలియదని విమర్శించారు. వినోద్కుమార్ లాంటి మేధావిని గెలిపించి పార్లమెంట్కు పంపిస్తే అనేక అభివృద్ధి పనులకు నిధులు తీసుకొస్తారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయడానికి కార్యకర్తలు కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, బీజేపీ అబద్ధాల ప్రచారం: మాజీ ఎంపీ వినోద్కుమార్
కాంగ్రెస్ సరారుకు దమ్ముంటే ఈ నెలాఖరులోగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను గుర్తించి, రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ ఇవ్వాలని మాజీ ఎంపీ వినోద్కుమార్ డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని వివరించారు. కేసీఆర్ భర్తీ చేసిన ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు ఇచ్చారో లేదో సీఎం రేవంత్, కోదండరాంరెడ్డి సమాధానం చెప్పాలని సవాల్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం ఏడు వేల స్టాఫ్నర్సు ఉద్యోగాలకు పరీక్ష నిర్వహిస్తే, సీఎం రేవంత్రెడ్డి నియామకపత్రాలు ఇచ్చి తామే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి, బండి సంజయ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ గత ఐదేండ్లుగా పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారని విమర్శించారు. వారెంటీ లేని గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రజలను ఆగం చేసిందని మండిపడ్డారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బండి సంజయ్ నయా పైసా అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు.