హైదరాబాద్: రాత్రి నోటీసులు ఇచ్చి, ఉదయాన్నే కూల్చివేస్తే ఎట్లా అంటూ హైడ్రాపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. శని, ఆదివారం వస్తుందంటే హైదారాబాద్లో ప్రజలు భయంతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారని చెప్పారు. కూకట్పల్లి నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతలపై ఆయన మీడియాతో మాట్లాడారు. వారాంతాల్లో హైడ్రా కాదు హైడ్రామా చేస్తున్నారని విమర్శించారు. నల్ల చెరువులో కూల్చివేతలు చేపట్టిన స్థలం పట్టదారులకు చెందిందన్నారు. వారికి ఏ విధమైన న్యాయం చేయనున్నారని ప్రశ్నించారు. చెరువుల్లో పట్టాలున్న వారికి నష్ట పరిహారం చెల్లించి, ఆ స్థలాన్ని ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
షెడ్లు కూల్చివేస్తున్న సమయంలో అక్కడ ఉంటున్న వారికి కనీసం సామాన్లు తీసుకునేందుకు కూడా సమయం ఇవ్వకపోవడం దురదృష్టకరమని చెప్పారు. రాత్రి నోటీసులు ఇచ్చి, ఉదయాన్నే కూల్చివేస్తే అక్కడ ఉంటున్న వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కూల్చివేతలతో నష్టపోయిన వారికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఆదివారం కూల్చివేతలు చేపట్టారని విమర్శించారు. ప్రజలను సంక్షేమ పథకాల నుంచి దారి మళ్లించేందుకు హైడ్రా కూల్చివేతలు చేస్తున్నారని ఫైరయ్యారు. కూల్చివేతలు చేశాక డిబ్రిస్ తీసివేయకుండా, చెత్తను జమ చేస్తున్నారని విమర్శించారు. హైడ్రా విధి విధానాలను స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.