జడ్చర్ల టౌన్, సెప్టెంబర్ 20 : గూడులేని ప్రతి పేదోడికి డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కావేరమ్మపేటలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో బుధవారం 120 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని చెప్పారు.
ఓవైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ.. మరోవైపు సంక్షేమ సౌరభాలు పూయిస్తున్న సీఎం కేసీఆర్కు అందరూ అండగా నిలవాలని కోరారు. కాంగ్రెస్ నేతల కల్లబొల్లి మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఎన్నికలు సమీస్తుండటంతో మోసం చేసేందుకు ఆరు గ్యారంటీ స్కీమ్లను తీసుకొచ్చారని విమర్శించారు. 55 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమీ చేయకుండానే, ఇప్పుడొచ్చి మరోసారి అవకాశం ఇవ్వాలని అడగం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. ఎన్నికల స్టంట్గా ఓట్ల కోసం కొత్త నాటకానికి తెర లేపిందని మండిపడ్డారు.