ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ చానళ్లు చేస్తున్న దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదురొంటాం. వాటిని నిషేధించాలని యూట్యూబ్కు అధికారికంగా ఫిర్యాదు చేస్తాం. గతంలో మాపై అవాస్తవాలను ప్రచారం చేసిన మీడియా సంస్థలపై ఇప్పటికే చర్యలు ప్రారంభించాం. ఇకనైనా కుట్రపూరిత ధోరణిని మార్చుకోకపోతే గుణపాఠం తప్పదు.
– కేటీఆర్
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ చానళ్లు కొన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చానళ్లపైన పరువునష్టం దావాలతోపాటు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నందుకు క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ధ అబద్ధాలను చూపిస్తున్నాయని మండిపడ్డారు. తమపై గుడ్డి వ్యతిరేకత వల్లనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడో ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్లను ప్రచారం చేస్తున్నాయని ఫైరయ్యారు. వ్యక్తిగతంగా తనతోపాటు తమ పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే ఇదంగా జరుగుతున్నట్టు భావిస్తున్నామని తెలిపారు. ప్రజలను అయోమయానికి గురిచేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా తాము భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
అసత్య ప్రచారాలు చేసే యూట్యూబ్ చానళ్లను నిషేధించాలి
గతంలో తమపై అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన న్యాయపరమైన చర్యలు ప్రారంభించామని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ చానల్స్ చేస్తున్న దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదురొంటామని తెలిపారు. ఆయా చానళ్లను నిషేధించాలని యూట్యూబ్కు అధికారికంగా ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు. కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ చానళ్లు చట్టప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఇటువంటి కుట్రపూరిత చానళ్ల ప్రాపగాండ, అసత్య ప్రచారం పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.