KTR | చరిత్ర దాస్తే దాగేది కాదు. ప్రగతిభవన్లో శిలాఫలకంపై కేసీఆర్ పేరుపై మట్టి పూయగానే చరిత్ర మరుగునపడిపోదు. తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలు తెంచిన కొడుకు కేసీఆర్. గవర్నర్ ప్రసంగంలో మార్పు మొదలైంది.. నిర్బంధం పోయింది అన్నారు. నిజమే.. 2014 జూన్ 2న దాస్య శృంఖలాల నుంచి తెలంగాణకు విముక్తి లభించింది. ఆ రోజునే నిర్బంధం పోయింది.
-కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ చేసిన ప్రసంగం పూర్తిగా రాజకీయ ప్రసంగంలా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. శాసనసభ చరిత్రలోనే అలాంటి విధ్వంస ప్రసంగం ఎప్పుడూ లేదని నిప్పులు చెరిగారు. 50 ఏండ్ల కాంగ్రెస్ దురాగాతాలను బరాబర్ చెప్తామని స్పష్టంచేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే గంజి కేంద్రాలు, ఆకలి చావులు, ఎన్కౌంటర్లేనని ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వం సృష్టించిన ఆస్తుల వివరాలను చెప్పకుండా, కేవలం అప్పుల గురించే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నదని ఆరోపించారు. ఆ సాకుతో ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలును అటకెక్కించాలని చూస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వం హామీలను అమలు చేయకుంటే ప్రజల తరపున అసెంబ్లీలో తాము గొంతు విప్పుతామని స్పష్టంచేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో కేటీఆర్ శనివారం మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూతకల్పనలతో ఉన్నదని ఆరోపించారు. అ ప్రసంగాన్ని చూసి ఒక శాసన సభ్యుడిగా సిగ్గుపడుతున్నానని అన్నారు.
కాంగ్రెస్ పాపాలను బరాబర్ చెప్తాం..
తాము ఎక్కడ ఉన్నా ప్రజాపక్షమేనని, తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమేనని, ప్రజల తరుపున గొంతు విప్పుతామని కేటీఆర్ ఉద్ఘాటించారు. 2014కు ముందు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉండేదో చెప్పాల్సిన బాధ్యత తమపై ఉన్నదని అన్నారు. ‘పడావు పడ్డ భూములు.. పాడుపడ్డ ఇండ్లు.. ఆకలి కేకలు.. ఆత్మహత్యలు.. వలసలు, కరువులు.. కర్ఫ్యూలు, ఎన్కౌంటర్లు.. కరెంట్ కోతలు, కటిక చీకట్లు.. నెర్రెలుబారిన నేలలు, నెత్తురు పారిన భూములు.. ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో నాడు చూపించిన అద్భుతాలు ఇవే కదా?’ అని ఎద్దేవా చేశారు.
నల్లగొండలో ఫ్లోరైడ్ బాధలు, దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు, పాతబస్తీలో మైనార్టీ బాలికల వివాహాలు, మహబూబ్నగర్లో గంజి కేంద్రాలు, పాలమూరు వలసలపై ఒక్కసారైనా ఒక్క కాంగ్రెస్ సభ్యుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి ముంబై ప్రతిరోజు 2 బస్సులు వెళ్లేవని గుర్తు చేశారు. ‘అసెంబ్లీ మొదటి రోజునే ఇంత ఉలిక్కిపడితే ఎలా? ఒక్కొక్క మంత్రి లేచి ఉలిక్కిపడి మాట్లాడుతున్నారు. అంత భయమెందుకు? భట్టి విక్రమార్క నిర్మాణాత్మక సూచనలు చేయాలన్నారు. కానీ గవర్నర్ ప్రసంగం నిర్మాణాత్మకంగా ఉంటే, విధ్వంసంగా ఉండకపోయుంటే మేము ఇదంతా చెప్పేవాళ్లం కాదు’ అని పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోయినా, తెలంగాణ పైసల్ని, నీళ్లను ఆంధ్రాకు తరలించుకుపోయినా మౌనంగా మంగళహారతులు పట్టింది కాంగ్రెస్ నాయకులు కాదా? అని ప్రశ్నించారు. నాడు తామంతా తెలంగాణ కోసం పదవులకు రాజీనామాలు చేస్తుంటే.. పదవులు కోసం పెదవులు మూసుకున్నదెవరు? అని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు రాజశేఖర్రెడ్డిని, కిరణ్కుమార్రెడ్డిని గుర్తు చేసుకున్నప్పుడు తాము కూడా అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంటుందని స్పష్టంచేశారు. ‘తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కింది ఎవరు? శ్రీకాంతాచారి, యాదిరెడ్డి, యాదయ్య తదితర వందలమంది ప్రాణాలను తీసుకున్నది ఎవరు? బలిదేవత ఎవరు? అనేది ప్రజలకు తెలుసు. ఆ మాట ఎవరన్నారో కూడా తెలుసు. ప్రజలే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు’ అని పేర్కొన్నారు.
దాస్య శృంఖలాలు తెంచిన కొడుకు కేసీఆర్..
‘చరిత్ర దాస్తే దాగేది కాదు. ప్రగతిభవన్లో శిలాఫలకంపై కేసీఆర్ పేరుపై మట్టి పూయగానే చరిత్ర మరుగునపడిపోదు. వాస్తవం ఏంటం టే.. 50 ఏండ్ల గోస తర్వాత తెలంగాణకు కలిసొచ్చే కాలానికి నడిసొచ్చిన కొడుకు కేసీఆర్. తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలు తెంచిన కొడుకు కేసీఆర్. గవర్నర్ తన ప్రసంగంలో మార్పు మొదలైంది.. నిర్భందం పోయింది అన్నారు. నిజమే.. 2014 జూన్ 2న దాస్య శృంఖలాల నుంచి తెలంగాణకు విముక్తి లభించింది. ఆ రోజునే నిర్బంధం పోయింది. బానిసకొక బానిసకొక బానిస అని శ్రీశ్రీ అన్నట్టు గతంలో మనల్ని పీడించిన వాళ్లు పోయినా.. వాళ్ల పేర్లు తలుచుకునే వారు ఇంకా ఇక్కడే ఉన్నారు’ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరు? 100 కోట్ల భారతీయులను కాదని, బయటి దేశం వాళ్లను అధ్యక్షులుగా చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐల గురించి మాట్లాడితే ఎలా?
– కేటీఆర్
తెలంగాణ ప్రగతిఖ్యాతి కేసీఆర్దే..
తెలంగాణను అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నిలిపిన ఖ్యాతి కేసీఆర్దేనని కేటీఆర్ స్పష్టంచేశారు. వలసలను నివారించారని, నల్లగొండను ఫ్లోరోసిస్ రహిత జిల్లాగా తీర్చిదిద్దారని, ఉరిసిల్లగా పేరుమోసిన సిరిసిల్లను సిరిశాలగా చేశారని, కునారిల్లిపోయిన కుల వృత్తులకు కొత్త ఊపిరిలూదారని, సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించారని కొనియాడారు. ‘పల్లెప్రగతిని చేసి చూపెట్టాం. గత పదేండ్లలో రక్తాన్ని రంగరించినం..మెదళ్లను కరిగించినం.. ప్రాణం పెట్టి పనిచేసినం.. కాబట్టే ఇవాళ ఒక్కొక్క రంగంలో భారతదేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉన్నది’ అని తేల్చి చెప్పారు.
పంటల బీమాకు, రైతుబీమాకు తేడా తెలియని వ్యక్తి సీఎంగా ఉన్నందుకు నిజంగానే సిగ్గుపడుతున్నా.
– కేటీఆర్
హామీలన్ని అమలు చేస్తే స్వాగతిస్తాం..
సర్పంచ్లకు నిధులు ఇస్తాం, మాజీలకు అది ఇస్తాం, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, బండి ఫ్రీ అని ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు చాలా చెప్పారని, మ్యానిఫెస్టోలోని ప్రతి హామీని నిలబెట్టుకోవాలని, అలా చేస్తే తాము కూడా స్వాగతిస్తామని కేటీఆర్ అన్నారు. ‘ఇచ్చిన 6 గ్యారెంటీల్లో రెండు ఇప్పటికే అమలు చేశామని గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. అది అవాస్తం.. ప్రజలను మభ్య పెట్టడమే. సూపర్ లగ్జరీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం అని చెప్పి నేడు పల్లె వెలుగు, సిటీ బస్సులు, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్లకే పరిమితం చేశారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇప్పటికే అమలులో ఉన్నది. మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా మహిళలకు రూ.2500, రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్, చేయూత పథకం కింద రూ.4 వేల పింఛన్ తదితర గ్యారెంటీల కోసం ఆడబిడ్డలు, పింఛన్దారులు, రేషన్కార్డు దారులు ఎదురుచూస్తున్నారు. హామీ ఇచ్చినట్టు 100 రోజుల్లో వాటిని పూర్తి చేస్తారా? చేయరా? అనేది చూస్తాం. ఇస్తే స్వాగతిస్తాం’ అని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించామంటున్నారని, కానీ ఎప్పటి నుంచో ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీసుల్లో అది కొనసాగుతూనే ఉన్నదని గుర్తుచేశారు.
సీఎం క్యాంపు ఆఫీస్ వద్ద ఇనుప కంచెలు 2012లో వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వమని, వాటిని మళ్లా వాళ్లే తీసేసి.. కంచెలు తీసేశామని బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. మెగా డీఎస్సీ, రూ.2 లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు బీమా, రుణాలు, ఆటో డ్రైవర్లకు ఆర్థికసాయం, బీసీలు, మైనార్టీలకు సబ్ప్లాన్, ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ తదితర వాగ్దానాలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తప్పకుండా ప్రజల పక్షాన అసెంబ్లీలో గొంతెత్తుతామని స్పష్టంచేశారు.
రేవంత్రెడ్డి కనీసం సీఎం అయిన తర్వాతైనా మర్యాదగా మాట్లాడుతారని అనుకున్నాం. తెలంగాణ తెచ్చిన నాయకుడిని కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అంటూ ఏకవచనంతో సంబోధించి.. తెలంగాణను వ్యతిరేకించిన వారిని మాత్రం ‘గారు గారు’ అంటూ మాట్లాడినప్పుడే ఆయన సంస్కారం అర్థమైంది. ‘అచ్చొసిన ఆంబోతు’.. ఇదా ఓ ముఖ్యమంత్రి మాట్లాడే భాష?
– కేటీఆర్
అప్పులు సరే.. ఆస్తుల సంగతి చెప్పరెందుకు?
విద్యుత్తు రంగం, పౌరసరఫరాలు తదితర శాఖలు అప్పుల కుప్పగా మారాయన్న ప్రభుత్వ వాదనను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ‘ఇవాళ కొత్తగా శ్వేతపత్రాలు ఇవ్వడమేంటి. మేమే కోకొల్లలుగా విడుదల చేశాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖల శ్వేత పత్రాలను ప్రచురించాం. తిమ్మిని బమ్మిని చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. కాంగ్రెస్ పాలనలో విద్యుత్తురంగం ఎట్లా ఉన్నదనేది అందరికీ తెలుసు. 2009-13 మధ్య నాలుగేండ్లలోనే 8,198 మంది రైతులు కరెంటు షాక్తో చనిపోయారు.
పరిశ్రమలకు పవర్హాలిడేలే. రైతులకు ఐదారు గంటలకు మించి కరెంటు ఇవ్వలేదు. విద్యుత్తు సంస్థలను అప్పులపాలు చేశామని చెప్తున్నారు. కానీ మేం సృష్టించిన ఆస్తుల గురించి మాత్రం చెప్పలేదు. ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని బద్నాం చేయడానికి, ఆరు గ్యారెంటీలను ఎగ్గొట్టేందుకు ఒక ఉపోద్ఘాతాన్ని రూపొందించారు. కాంగ్రెస్ అప్పజెప్పిన నాడు విద్యుత్తు శాఖ అత్యంత దురవస్థలో ఉన్నది. 2700 మెగావాట్ల కరెంటు లోటు ఉన్నది. రూ.22,423 కోట్లు అప్పులున్నాయి. ప్రస్తుతం ట్రాన్స్కో ఆస్తులు రూ.24,476 కోట్లు. జెన్కో ఆస్తులు 2014లో రూ.19,607 కోట్లుంటే నేడు రూ.53,963 కోట్లు. విద్యుత్తు ప్లాంట్లు కట్టడం తప్పా? 19 వేల మెగావాట్లకు చేర్చడం తప్పా?’ అని కేటీఆర్ నిలదీశారు.
వ్య వసాయ మోటర్ల కనెక్షన్లు 19 లక్షల నుంచి 29 లక్షలకు పెరిగాయని, రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్తు ఇవ్వడానికి నెలకు వెయ్యి కోట్ల చొప్పున ఏటా రూ.12 వేలకోట్లు ఖర్చుచేశామని చెప్పారు. 10 ఏండ్లలో ఒక్క సంవత్సరం కూడా క్రాప్ హాలిడే ఇవ్వకుండా నడిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. ఉచిత విద్యుత్తును ఊడగొట్టే పన్నాగాన్ని ప్రతిఘటిస్తామని స్పష్టంచేశారు. పౌరసరఫరాల శాఖలో రూ.56 వేల కోట్ల అప్పులని చెప్తున్నారని.. కానీ, ప్రస్తుతం రూ.30వేల కోట్ల విలువ చేసే ధాన్యం ఉన్నదని, రూ.17 వేల కోట్లు రావాల్సిన నిధులు ఉన్నాయని వెల్లడించారు.
అప్పుచేసి పప్పు బెల్లాలు పంచలేదు
బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి ఆస్తుల సృష్టికి పెట్టుబడి పెట్టిందని, అందుకు కేంద్రప్రభుత్వ సంస్థలు, ఆర్బీఐ తదితర సంస్థల నివేదికలు నిదర్శమని కేటీఆర్ తెలిపారు. అప్పులు చేసి పప్పుబెల్లాలు పంచలేదని స్పష్టంచేశారు. అమెరికా జీడీపీలో అప్పులు 123 శాతం, భారత్దేశానివి 57 శాతం, తెలంగాణవి 27.08 శాతం మాత్రమేననిని వివరించారు. అయినా లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. వడ్డీల భారం కూడా చాలా తక్కువని, రాష్ట్ర సొంత పన్ను ఆదాయం గతంలో 76 శాతం ఉంటే.. నేడు అది 84.2 శాతానికి పెరిగిందని తెలిపారు. సచివాలయం, ప్రగతిభవన్, కలెక్టరేట్లు, కమాండ్ సెంటర్లు, అండర్పాస్లు, యాదాద్రి ఆలయం నుంచి అంబేద్కర్ సచివాలయం వరకు కట్టిందే కేసీఆర్ ప్రభుత్వమని.. అది అప్పా? పెట్టుబడా? ఆలోచించాలని కోరారు.
మీరు విద్యుత్తు సంస్థల అప్పుల లెక్క చెప్పిన్రు.. నేను ఆస్తుల లెక్క చెప్త.. 81,516 కోట్ల అప్పు చేసి పోయిన్రని అన్నరు.. కానీ, కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ఏర్పడిన తర్వాత సృష్టించిన ఆస్తుల గురించి చెప్పలేదు.. బద్నాం చేయడానికి, బట్టకాల్చి మీద వేయడానికి, అప్పుల సాకు చెప్పి, ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టడానికి.. ఒక ఉపోద్ఘాతాన్ని రూపొందించి, ఇగో అప్పుల పాలైపోయింది.. దివాలా తీసింది.. అని చెప్పి, తప్పించుకోవడమే తప్ప ఇంకోటి కాదు.. ఆ రోజు కాంగ్రెస్ మాకు రాష్ట్రం అప్పజెప్పిపోయిన ఆస్తులు చూస్తే, 59,132 కోట్లు.. మా ప్రభుత్వం సృష్టించిన ఆస్తులు కలిపితే లక్షా 37 వేల 571 కోట్ల రూపాయలు. ఆస్తులను మాత్రం చూపెట్టకుండా, అప్పులు మాత్రమే చూపెట్టి.. తిమ్మిని బమ్మి చేసి, ఏదో బుకాయించి.. ఏదో చేస్తం.. జాదూగర్ చేస్తం అంటే కుదరదు.
– కేటీఆర్
ఫార్మాసిటీ రద్దును పునఃసమీక్షించుకోండి..
కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమన నిర్ణయాలు తీసుకుంటే వ్యతిరేకిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఫార్మాసిటీని సీఎం రేవంత్రెడ్డి రద్దు చేస్తామని ప్రకటించినట్టు విన్నామని, అది రాష్ర్టానికి మంచిది కాదని, ఆ నిర్ణయాన్ని పునరాలోచించాలని సూచించారు. ఢిల్లీ, కర్ణాటక నుంచి రిమోట్ కంట్రోల్ చేయాలని చూస్తే సహించబోమని తేల్చిచెప్పారు. ప్రజా కవి కాళోజీ కవిత ‘ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరలకు తరిమికొడతాం. ప్రాంతంవాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతరపెడతాం’ అని ఈ సందర్భంగా ఉటంకించారు.