చౌటుప్పల్, ఏప్రిల్ 29 : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను ఆయన కుమార్తె కవిత విమర్శించడం సరికాదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కవిత పెట్టిన పార్టీపై స్పందించారు. కూతురుకి తండ్రి అంటే ప్రేమ ఉండాలని సూచించారు. పార్టీ పెట్టిన తొలి మీటింగ్లోనే తండ్రిపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. తండ్రినే గౌరవించలేని ఆమె ప్రజలకు తల్లి ఎలా అవుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ వల్లే ఆమెకు రాజకీయంగా పేరొచ్చిందని గుర్తుచేశారు. లిక్కర్ కేసులో ఆమెకు ఇంకా క్లీన్ చిట్ రాలేదని తెలిపారు. కోర్టు కేసు పెండింగ్లో ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, కేసీఆర్పై వ్యాఖ్యలు చేసేముందు ఆమె తనపై ఉన్న కేసుల విషయమై స్పష్టత ఇవ్వాలని సూచించారు. కవిత పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని అన్నారు. పార్టీ పెట్టడం అంటే పాన్షాపు పెట్టినంత సులభం కాదని ఎద్దేవా చేశారు.