హైదరాబాద్: ఆచరణకు సాధ్యంకాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. గ్యారంటీలను అమలు చేయడానికి ఆపసోపాలు పడుతున్నది. అమలు చేస్తున్న ఒకటీ అరా సంక్షేమ పథకాలకు అనేక కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గిస్తున్నది. దీంతో రేవంత్ సర్కార్పై ప్రజలు తిరగబడుతున్నారు. ఊరూరా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను నిలదీస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ పాలనే బాగుండేనంటూ మండిపడుతున్నారు. దీంతో పోలీసుల సహాయం లేనిదే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వెళ్లలేకపోతున్నారు. రుణ మాఫీ కాలేదని, రైతు బంధు రాలేదని జనాలు ఫుల్లు తిడుతున్నరని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి (Komatireddy Rajagopal Reddy) ఇలాంటి అనుభవమే ఎదురైంది. 4 పథకాల ప్రారంభోత్సవంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మసీదుగూడెంలో లబ్ధిదారులకు రైతు భరోసా మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తమకు రైతు రుణమాఫీ కాలేదని, రైతుబంధు రాలేదని జనాలు తిరుడున్నారని వాపోయారు. అంతా కేసీఆర్ పాలనే బాగుండే అంటూ ఇంకా మెచ్చుకుంటున్నారని చెప్పారు. అయితే మాఫీ కాలేదని, రైతుబంధు రాలేదని జనాలు తిడుతున్నారు. అదే రూ.2 లక్షల రుణ మాఫీ అయినోల్లు మాత్రం జేబులో వేసుకొని సప్పుడు చేస్తలేరుని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
మా గవర్నమెంట్లో కరప్షన్..
కాంగ్రెస్ ప్రభుత్వంలో కరప్షన్ పెరిగిపోతున్నదని, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లదే హవా నడుస్తున్నదని.. భూ మాఫియా పేట్రేగిపోతున్నదంటూ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఎంతటి పెద్దవాడైనా రోడ్డుమీదికిడుస్తానంటూ హెచ్చరించారు. ఆదివారం జడ్చర్లలో ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు ఉమ్మడి జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి నాలుగు పథకాలు ప్రారంభిస్తున్న సందర్భంలో జడ్చర్ల ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని లేపింది.
కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతున్నదని.. మంత్రులకు ఎమ్మెల్యేలకు సఖ్యత ఉందా..లేదా..? ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారా..? అని అనుమానాలు కలుగుతున్నాయి. ‘ప్రజా పాలన బాగుంది..ప్రజలకు కావాల్సిందే ఈ రోజు జరుగుతున్నది.. అయినా ఆ గవర్నమెంట్కు ఈ గవర్నమెంట్కు కొంచమే తేడా ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంకా కొంచెం అవినీతి ఉన్నది. కొంతమంది రెవెన్యూలో సమస్యలు ఉంటే మళ్లీ ప్రొహిబిట్లో పెట్టి వసూలు చేసుకుంటున్నారు. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైనా గాని.. ఎంత పెద్ద వారైనా గాని.. కొంతమంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్లకే మాట్లాడుకొని ల్యాండ్ ప్రొహిబిటేడ్లో ఉంటే ముప్పై, నలభై పర్సెంట్ రాయించుకొని చేస్తున్నారు. కొంత మంది నా దగ్గరకు వచ్చారు. కచ్చితంగా ఎంత పెద్ద నాయకుడైనా వాన్ని రోడ్డు మీదకు లాగుతా’ అని అనిరుధ్రెడ్డి హెచ్చరించారు.