వచ్చే డిసెంబర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో మోదీ కన్నా ముందే ఈడీ వచ్చింది. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల వద్దకు వెళ్లి ఏం చేస్తామో చెప్పుకొని గెలవాలే తప్ప.. ఈడీ, సీబీఐని ప్రయోగిస్తే కుదరదు.
– ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ చేసిన కుట్రను ప్రజల ముందు ఉంచినందుకే తనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేపై బీజేపీ ఈడీ, సీబీఐని ప్రయోగిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కేసులు పెట్టడం బీజేపీ హీనమైన, నీచమైన, రాజకీయ ఎత్తుగడ తప్ప మరేమీ లేదని చెప్పారు. ఈడీని పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ‘ఏం చేస్తరు? ఉరికంబం ఎకిస్తరా? ఎకువలో ఎకువ జైల్లో పెడ్తరు? పెట్టకోండి’అని తేల్చిచెప్పారు. ఎలాంటి విచారణను ఎదురోడానికైనా సిద్ధమేనని స్పష్టంచేశారు. గురువారం హైదరాబాద్లోని తన నివాసం వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మీడియాలో లీకులు ఇచ్చి మంచిపేరును చెడగొట్టాలని చేసే ప్రయత్నాలను, బీజేపీ చౌకబారు ఎత్తుగడలను ప్రజలు తిప్పికొడుతారని హెచ్చరించారు. బీజేపీ చేష్టలకు, మోదీ కుట్రలకు భయపడబోమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల అండ ఉన్నంతకాలం ఎవరికీ ఇబ్బందులు రావని పేర్కొన్నారు. కేంద్రసంస్థలు వచ్చి ప్రశ్నిస్తే తప్పకకుండా సమాధానాలు చెప్తానని స్పష్టం చేశారు. భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటును సీఎం కేసీఆర్ ప్రకటించగానే బీజేపీ గడగడలాడించిందని, దాన్ని జీర్ణించుకోలేక చౌకబారు రాజకీయాలకు తెరలేపిందని ఆరోపించారు.
మోదీ అధికారంలోకి వచ్చిన 8 ఏండ్లలో 8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకొన్న ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరగడానికి ఏడాది ముందు మోదీ వచ్చేకన్నా ముందు ఈడీ రావటాన్ని గమనిస్తున్నామని, అదేమీ కొత్త విషయం కాదని చెప్పారు. వచ్చే డిసెంబర్లో తెలంగాణలో ఎన్నికలు ఉండటంతో మోదీ కన్నా ముందు ఈడీ వచ్చిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల వద్దకు వెళ్లి ఏం చేస్తామో చెప్పుకొని గెలవాలే తప్ప.. ఈడీ, సీబీఐని ప్రయోగిస్తే కుదరదని స్పష్టంచేశారు. రాజకీయ పం థాను మార్చుకోవాలని ప్రధాని మోదీకి హితవు పలికారు. అత్యంత చైతన్యం కలిగిన తెలంగాణలో బీజేపీ నాటకాలు కొనసాగవని తేల్చిచెప్పారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలకు సేవ చేయటాన్ని విరమించబోమని, బీజేపీ వైఫల్యాలను ఎండగట్టడాన్ని ఆపబోమని స్పష్టంచేశారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు, ఎల్ రమణ, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, కార్పొరేషన్ చైర్మన్లు గజ్జెల నగేశ్, మేడే రాజీవ్సాగర్, జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, టీఆర్ఎస్ నాయకురాలు సుశీలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవిత ఇంటి ప్రాంగణమం గురువారం ఉదయం నుంచే టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కోలాహలంగా మారిం ది. టీఆర్ఎస్పై కక్ష సాధింపులో భాగంగానే పార్టీ నేతలపై ఈడీ, సీబీఐని ప్రయోగిస్తున్నారంటూ కార్యకర్తలు మండిపడ్డారు. మోదీ సర్కార్ కుట్రలను తిప్పికొడతామని ప్రతినబూనారు. మోదీ డౌన్..డౌన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పార్టీ శ్రేణులు సంయమనంతో ఉండాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.