Pushpa 3 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో అత్యంత బిజీ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ‘పుష్ప’ సిరీస్తో దేశవ్యాప్తంగా అపారమైన క్రేజ్ సంపాదించుకున్న బన్నీ, ఇప్పుడు వరుసగా భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఆయన కొత్త లైనప్ చూసిన అభిమానుల్లో ఒకవైపు ఉత్సాహం కనిపిస్తుండగా, మరోవైపు ‘పుష్ప 3’ భవితవ్యంపై ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ‘రాకా’ షూటింగ్లో పాల్గొంటున్నారు. భారీ వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా ఈ సినిమా విడుదల 2027 చివర్లో లేదా 2028కి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
‘రాకా’ తర్వాత బన్నీ మరో తమిళ స్టార్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్తో సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగానే, మలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్తో కూడా అల్లు అర్జున్ సినిమా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇటీవల బసిల్ సోషల్ మీడియాలో ‘Icon’ అని రాసి ఉన్న క్యాప్ ఫొటోను షేర్ చేయడం ఈ ప్రాజెక్ట్పై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూర్చింది.బసిల్ జోసెఫ్తో సినిమా గురించి అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఇద్దరి మధ్య చర్చలు పూర్తయ్యాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన చర్చ ఇండస్ట్రీలో మొదలైంది.
అల్లు అర్జున్ వరుసగా తమిళ, మలయాళ దర్శకులతో సినిమాలు చేస్తుండటంతో, తనను స్టార్ స్థాయికి తీసుకెళ్లిన తెలుగు దర్శకులతో మళ్లీ ఎప్పుడు పని చేస్తారనే ప్రశ్న అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ‘పుష్ప’తో ఆయన జాతీయ అవార్డు అందుకుని పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. అందుకే సుకుమార్ దర్శకత్వంలో రావాల్సిన ‘పుష్ప 3’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రస్తుతం బన్నీ కమిట్మెంట్లను పరిశీలిస్తే, ‘పుష్ప 3’ ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లీ సినిమా, లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్ట్, బసిల్ జోసెఫ్ చిత్రం పూర్తయ్యే వరకు సుకుమార్ సినిమా పట్టాలెక్కడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ‘పుష్ప 3’ 2030 తర్వాతే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.