హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మానవత్వం చాటుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఎడమవైపున కూర్చున్న ముగ్గురు సిబ్బందిలో ఒకరు స్పృహతప్పి పడిపోయారు.
గమనించిన ఓ మహిళా ఉద్యోగి వైద్యుడి కోసం బయటికి వెళ్తున్న క్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ గమనించి డాక్టర్ సంజయ్కు విషయం చెప్పారు. ఆయన వెంటనే అతని వద్దకు వెళ్లి చేయి పట్టుకొని పల్స్ చెక్ చేశారు. అతని భుజంతట్టి ధైర్యం చెప్పారు. నీళ్లు తాపించారు. అతడు కుదుటపడిన తర్వాత తన సీట్లోకి వెళ్లారు.