హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు వివరించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న(Mla Joguramanna) బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్(CM KCR) చేపట్టిన పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్(BRS) ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. అరవై ఎనిమిది సంవత్సరాలు పాలించిన గత ప్రభుత్వాలు ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించలేకపోయాయని విమర్శించారు. తెలంగాణ సాధించిన తొమ్మిదేండ్ల కాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు.
స్థానిక బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీల నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు. ఈ సమ్మేళనంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, నాయకులూ అష్రఫ్, సాజిదోద్దీన్, సలీం,స్వరూప రాణి, బొడగం మమత, బుట్టి శివకుమార్ పాల్గొన్నారు.