హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ (BJP) ఒక చెల్లని రూపాయి అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూలుస్తామని పిచ్చికూతలు కూస్తే ఖబడ్ధార్ అని హెచ్చరించారు. బీజేపీ దొంగల పార్టీ అని విరుచుపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం ఒక్కపైసా ఇవ్వలేదని విమర్శించారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే వివేకానందతో కలిసి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాన్ ఇండియా పొలిటికల్ సూపర్స్టార్ అని చెప్పారు. కేంద్రం ఏ వర్గానికి మేలు చేసిందో ప్రధాని మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇక్కడి వనరులపై మోదీ దృష్టి పెట్టారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని చూసి మోదీ సహా బీజేపీ ముఖ్య నేతలు నేర్చుకోవాలని సూచించారు. ఈస్టిండియా కంపెనీ దేశాన్ని దోచుకున్నట్టు మోదీ ఆధ్వర్యంలోని నార్త్ ఇండియా కంపెనీ తెలంగాణను దోచుకోవడానికి వచ్చిందని చెప్పారు. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గుజరాత్కు వెళ్తే రిసీవ్ చేసుకోలేదని విమర్శించారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ పనిగా పెట్టుకున్నదని ఫైరయ్యారు. ఎవరు అధికారంలో ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడించారు.
తెలంగాణపై రాక్షసులు పడ్డట్టు బీజేపీ నేతలు దాడి చేస్తున్నారని ఎమ్మెల్యే వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ కంటే ముందే సీఎం కేసీఆర్ రాజకీయాల్లో వచ్చారని చెప్పారు. తెలంగాణ సాధించి అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ అని, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్న నాయకుడు మంత్రి కేటీఆర్ అని వెల్లడించారు. ఆర్థిక క్రమశిక్షణను తెలంగాణ అద్భుతంగా పాటిస్తున్నదని చెప్పారు.
కేంద్రం ఇస్తున్న అవార్డులే తెలంగాణ ప్రగతికి నిదర్శనమని వివేకానంద చెప్పారు. వాస్తవాలు తెసుకోకుండా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్లో పరిశ్రమలకు పవల్ హాలిడేలు ప్రకటించారని విమర్శించారు. తెలంగాణలో మాత్రం అన్ని రంగాలకు 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పారు. బండి సంజయ్ నెత్తిన రూ.100 పెట్టి రూపాయికి కొనమన్నా కరీంనగర్లో ఎవరూ తీసుకోరని ఎద్దేవా చేశారు.
మోదీ ఎంపీగా ఉన్న వారణాసిలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు. నాగార్జున సాగర్, హుజూర్నగర్ ఉపఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు రాలేదన్నారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.