నిజామాబాద్ : పేద ప్రజలని వంచించే గుజరాత్ మోడల్ మనకు వద్దని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే తెలంగాణ మోడల్ ముద్దు అని పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మాక్లూర్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ మహిళలకు పెద్ద పీట వేశారన్నారు. కేసీఆర్ లాంటి దమ్మున్న సీఎం దేశంలోనే ఎవరు లేరని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి చెబితే రామాయణం.. వింటే భారతం అంతా అని వ్యాఖ్యానించారు.
ఎలాంటి టెన్షన్ లేకుండా పెన్షన్లు ప్రతి కుటుంబానికి అందుతున్నాయన్నారు. ఉచితాలంటూ పేద ప్రజల పై కక్ష గట్టిన మోదీ ప్రభుత్వానికి ముసలల్లోకి అన్నం పెడితే బాధ ఎందుకని ఆయన నిలదీశారు. బీజేపీ పేదోళ్లకు వ్యతిరేకం అని, టీఆర్ఎస్ బీదల పార్టీ అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ పథకాలు దేశమంతా అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని,
దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని స్పష్టం చేశారు. చైతన్య మూర్తులైన మహిళలు అభివృద్ధిలో దుసుకెళ్లాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.