నందిపేట్, సెప్టెంబర్ 5: ఎంపీ ధర్మపురి అర్వింద్ నందిపేట్ పోలీస్స్టేషన్కు వెళ్లి వీధిరౌడీలా, గూండా మాదిరిగా ప్రవర్తించడంపై ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ను కూలగొడతానంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా నందిపేట్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జీవన్రెడ్డి మాట్లాడారు. ధర్మపురి అర్వింద్కు దమ్ముంటే ఆర్మూర్లో తనపై పోటీకి రావాలని సవాల్ విసిరారు. పసుపు బోర్డు తెస్తానని ప్రజలతో ఓట్లు వేయించుకొన్న ఎంపీ అర్వింద్ తప్పించుకొని తిరుగుతున్నాడని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి?, ఎప్పుడు గ్రామాల నుంచి తరిమికొట్టాలని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు.
అబద్ధాలతో పబ్బం గడుపుకొంటున్నాడని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ బడా జోకర్ పార్టీ అయ్యిందని ఎద్దేవాచేశారు. ఆ పార్టీ ఎంపీ అర్వింద్ జోకర్, లోఫర్ అయ్యాడన్నాని ఎద్దేవాచేశారు. చెప్పేవన్నీ అబద్ధాలని, ఆయన ఎంఏ చదివినట్టు చూపుతున్న సర్టిఫికెట్లు ఫేక్ అని ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు. ఒకే ఇంట్లో మూడు పొయ్యిలు ఉన్నాయని, తండ్రిది ఒక పార్టీ, పెద్ద కొడుకుది మరో పార్టీ, చిన్న కొడుకుది ఇంకో పార్టీ అని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి, ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తెచ్చారు?, ఎంత అభివృద్ధి చేశారో, ఎన్ని జీవోలు తెచ్చారో ఎంపీ అర్వింద్ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎంపీ అర్వింద్పై పోలీసులకు ఫిర్యాదు
పోలీసులు, సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్పై టీఆర్ఎస్ నాయకులు ఆదివారం నందిపేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ అర్వింద్ నాలుగురోజుల క్రితం పోలీస్స్టేషన్కు వచ్చి పోలీస్స్టేషన్ను కూలగొడతామంటూ వ్యాఖ్యలు చేయడం, సీఎంను ఉద్దేశించి ఇష్టారీతిగా మాట్లాడటం, పోలీసుల పట్ల చులకనగా మాట్లాడిన ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్సై శోభన్బాబుకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.