హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ పేరుకే పీసీసీ అధ్యక్షుడు అని పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పినట్లు రేవంత్ నడుచుకుంటున్నారని చెప్పారు. రేవంత్ నైజం ఏంటో శశిథరూర్పై ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే అర్థమవుతుందన్నారు. తెలంగాణ కంటే కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లిక్కర్ అమ్మకం ఎక్కువగా ఉందన్నారు. బెల్ట్ షాపులకు కర్త, కర్మ, క్రియ.. కాంగ్రెస్ పార్టీనే అని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు. అందుకు చార్జీషీటు వేస్తారా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
గజ్వేల్లో నిర్వహించిన కాంగ్రెస్ సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డిని తిడుతున్నారు అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అబద్దాలు మాట్లాడి ప్రజలను మోసం చేసేలా కాంగ్రెస్ నేతల మాటలు ఉన్నాయన్నారు. గజ్వేల్కు రైలు వచ్చిందంటే.. అది కేసీఆర్ వల్లే అని తెలిపారు. అధికారం కోల్పోయి 10 ఏండ్లు అవుతుండటంతో ఆక్రోశంతో కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పల్లెను వదిలిన ప్రతి ఒక్కరూ కేసీఆర్ పాలనలో మళ్లీ పల్లెకు చేరారు అని ఎంపీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.