హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. స్పైస్ బోర్డుకు రూ. 6 కోట్ల నిధులు తెచ్చానని అరవింద్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన తెచ్చిన నిధులు కేవలం రూ. 2 కోట్లకు మించలేదన్నారు. నిజామాబాద్ ఎంపీగా కవిత జిల్లాకు ఎన్నో కోట్ల నిధులు తెచ్చి, అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు. అరవింద్ ఎంపీగా గెలిచి మూడేండ్లు అవుతున్నా ఇప్పటి వరకు జిల్లాకు నిధులు తెచ్చిదేమీ లేదన్నారు.
టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎంపీ అరవింద్ ఓ అపరిచితుడి మాదిరిగా, అరాచకం సృష్టించే వాడిగా తయారయ్యాడని మండిపడ్డారు. నోరు తెరిస్తే బూతులు, అబద్ధాలే మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. పసుపు బోర్డుపై మాట తప్పిన అరవింద్ను జీవితాంతం బాండ్ పేపర్లు వెంటాడుతూనే ఉంటాయన్నారు. ఎమ్మెల్సీ కవిత సంస్కారంగా మాట్లాడితే.. అరవింద్ మాత్రం ఏకవచనంతో సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని కోపోద్రిక్తులయ్యారు.
అవినీతిలో పుట్టి పెరిగిన అరవింద్ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని జీవన్ రెడ్డి విమర్శించారు. అవినీతి డబ్బులతోనే అరవింద్ పెద్దగా అయ్యాడు. అరవింద్ ఇంట్లోనే మూడు పార్టీలున్నాయి.. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఎద్దెవా చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులపై అరవింద్ పరుష పదజాలంతో దూషిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని జీవన్ రెడ్డి హెచ్చరించారు.