బీజేపీపై మాజీ మంత్రి జగదీశ్రెడ్డి మండిపాటుమద్యం పాలసీ కేసులో ఆధారాలు ఉన్నాయని, నిరూపిస్తానని చెప్తున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. రెండేండ్లుగా వాటిని ఎందుకు బయటపెట్టలేదు? ఈ కేసులో ఆయన భాగస్వామ్యంపై అనుమానాలు కలుగుతున్నాయి.ఈడీ ఆయననూ ప్రశ్నించాలి.
– మాజీ మంత్రి జగదీశ్రెడ్డి
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేంద్రమంత్రి కిషన్రెడ్డిని సైతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో కిషన్రెడ్డికి సైతం భాగస్వామ్యం ఉన్నదేమోనన్న అనుమానం వ్యక్తంచేశారు. తన వద్ద ఆధారాలు ఉన్నాయని, నిరూపిస్తానని చెప్తున్న కిషన్రెడ్డి రెండేండ్లుగా వాటిని ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కిషన్రెడ్డికి సోయిలేదని, ఎప్పుడేమి మాట్లాడుతాడో ఆయనకే తెలియదని మండిపడ్డారు. తొలుత కవిత కేసుతో తెలంగాణకు సంబంధం లేదన్నారని, ఇప్పుడు మాటమార్చి తాను నిరూపిస్తానని ఎలా అంటారని ప్రశ్నించారు. ఈడీకి బదులుగా తానే విచారణ చేస్తానని కిషన్రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని మండిపడ్డారు. మీడియాలో స్పేస్ తప్ప ప్రజల్లో బేస్లేని నాయకుడు కిషన్రెడ్డి అని ఎద్దేవాచేశారు. ప్రజలను కొట్టాలే, అదానీకి పెట్టాలన్న ఆలోచన తప్ప బీజేపీ మరో ఆలోచన లేదని విమర్శించారు. దేశంలో బీజేపీకి కేసీఆర్, కేజ్రీవాల్ వణుకుపుట్టిస్తున్నారని, అందుకే ఎన్నికల వేళ ఈడీని ఉసిగొల్పి తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ అవగాహన ప్రకారమే పరస్పరం బలహీన అభ్యర్థులను నిలబెడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ వేటకుక్కల్లా బీఆర్ఎస్ నేతలను ఎత్తుకుపోతున్నాయని, తమ పార్టీ నేతలను భయపెట్టి దౌర్జన్యంగా చేర్చుకుంటున్నారని ఆరోపించారు.
రైతులను ఆదుకునే సోయిలేదు
ఎండిపోతున్న పొలాలకు నీళ్లిచ్చి, రైతులను ఆదుకోవాలన్న సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకుండాపోయిందని జగదీశ్రెడ్డి మండిపడ్డారు. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పరిస్థితి ఘోరంగా ఉన్నదని, ఎస్సారెస్సీ, వరదకాల్వ వెంట లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రులు పాలన గాలికొదిలేశారని, సమీక్షలు చేయడంలేదని మండిపడ్డారు. కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉన్నా ఆ ప్రయత్నం చేయలేదని విమర్శించారు.కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీళ్లు తెచ్చేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు. కరువుపై, రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
నల్లగొండ మంత్రులకు లాగులు తడుస్తున్నాయి
‘నాగార్జునసాగర్ కట్ట మీదికి పోవాలంటేనే నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రుల లాగులు తడుస్తున్నాయని జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి దమ్ముంటే సాగర్ కట్ట మీద నడవాలని, ఎడమకాల్వ తూములు తీసి నీళ్లు తీసుకొని రావాలని సవాల్ చేశారు. నీళ్ల విషయంలో సోయి లేక పది రోజులుగా నిద్రనటిస్తున్నాడని, దొంగలాగ తప్పించుకు తిరుగుతున్నాడని విమర్శించారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి కనీసం పరిజ్ఞానం లేదని,కోదాడ,హుజూర్నగర్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ నేతలు నల్లగొండ జిల్లాలో మంత్రులు రైస్మిల్లరు, క్రషర్లు, కాంట్రాక్టర్ల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఏమీ లేకపోయినా ఇక్కడ,అక్కడ రూ.100 కోట్ల రోడ్లుంటూ నలుగురు కాంట్రాక్టర్లను పిలిచి వసూళ్లు చేసిన చరిత్ర నల్లగొండ మంత్రులదని విమర్శించారు. ఇండ్లు కట్టుకున్నవారికి నోటీసులిచ్చి యాభై వేలు, లక్ష వసూలు చేసేంత నీచానికి దిగజారారనని ఆరోపించారు. సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు కంచర్ల కృష్ణారెడ్డి, క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మల్లికార్జున్రెడ్డి పాల్గొన్నారు.